యాషెస్ వివాదం..సునాక్ వర్సెస్ ఆల్బనీస్

అంతర్జాతీయ క్రికెట్ లో ఆస్ట్రేలియా జట్టుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎక్కువగా స్లెడ్జింగ్ కు పాల్పడుతుంటారని, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను రెచ్చగొడుతుంటారని అప్రతిష్ట ఉంది. ఇక, టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తో సైమండ్స్ మంకీ గేట్ వివాదం మొదలు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ బాల్ టాంపరింగ్ వరకు ఆసీస్ క్రికెటర్ల వివాదాస్పద శైలి వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలోనే కండక్ట్ పరంగా ఆసీస్ క్రికెటర్లు గాడిన పడుతున్నారనుకుంటున్న తరుణంలో కంగారూలు తాజా వివాదానికి కేంద్ర బిందువయ్యారు.

ఇంగ్లండ్ తో జరుగుతున్న యాషెస్ టెస్ట్ సిరీస్ లో ఆసీస్ క్రికెటర్ల ప్రవర్తన వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ జానీ బెయిర్ స్టో ను ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ ఔట్ చేసిన విధానం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని విమర్శలు వస్తున్నాయి. మాజీ క్రికెటర్లు కూడా ఆసీస్ క్రికెటర్ల తీరును తప్పుబడుతున్నారు. సాధారణంగా ఇటువంటి వివాదాలు ఆటగాళ్లకు, మాజీ ఆటగాళ్లకు మాత్రమే పరిమితం అవుతుంటాయి. కానీ, తాజాగా ఈసారి ఆసీస్ ఆటగాళ్ల వివాదం ఇరు దేశ ప్రధానుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.

ఆసీస్ క్రికెటర్లు వ్యవహార శైలిపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికార ప్రతినిధి విమర్శలు గుప్పించడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తాము ఆస్ట్రేలియా క్రికెటర్లలాగా గెలవాలనుకోవట్లేదని బెన్ స్టోక్ చెప్పాడని, ఆ అభిప్రాయాన్ని బ్రిటన్ ప్రధాని కూడా అంగీకరించారని సునాక్ అధికార ప్రతినిధి అన్నారు. అయితే, ఆసీస్ ప్రధాని ఆల్బనీస్ అధికారిక నివాసం దగ్గర నిరసన వ్యక్తం చేయాలని సునాక్ భావించడం లేదని ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో, ఆ విమర్శలకు ఆసీస్ ప్రధాని ఆల్బనీస్ స్పందించారు. ఆసీస్ పురుషుల, మహిళల క్రికెట్ జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయని, ఆ విషయంలో తాను గర్వపడుతున్నానని అన్నారు.