అయ్యో ఎంత కష్టం? తల్లైన పన్నెండేళ్ల చిన్నారి

విన్నంతనే ఒళ్లు జలదరించే ఈ ఉదంతం పంజాబ్ లో చోటు చేసుకుంది. అమ్రత్ సర్ జిల్లా ఫగ్వారాకు చెందిన పన్నెండేళ్ల బాలిక.. చిన్నారికి జన్మనిచ్చింది. తాను గర్భవతినన్న విషయం ఆ చిన్నారికి అప్పటివరకు తెలీకపోవటం గమనార్హం. నిజానికి ఆమె ఏడు నెలల క్రితమే గర్భం దాల్చినా.. అభంశుభం తెలియని ఆ పాపకు తెలీదు. తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న ఆమెను గురునానక్ దేవ్ ఆసుపత్రికి తీసుకొచ్చిన సందర్భంగా..పాప గర్భవతి అన్న విషయాన్ని వైద్యులు గుర్తించారు.

ఆ వెంటనే ఆమెకు ప్రసవం చేసి 800 గ్రాముల బరువున్న పాపను బయటకు తీశారు. అయితే.. తల్లీబిడ్డల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వైద్యులు అందించిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టారు. తన కుమార్తె గడిచిన ఏడు నెలలుగా కడుపునొప్పితో బాధ పడుతున్నట్లుగా ఆమె తండ్రి వైద్యులకు చెప్పారు.

నొప్పి అన్నప్పుడల్లా తాను మందు తెచ్చి ఇచ్చేదానినని.. ఆసుపత్రికి వచ్చిన తర్వాతే ఆమె గర్భవతి అన్న విషయం తెలిసిందని చెప్పారు. ఇంట్లో తామిద్దరమే ఉంటామని.. తన భార్య తనను వదిలి వెళ్లినట్లుగా బాధితురాలి తండ్రి చెప్పుకొచ్చారు. దీంతో.. అసలేం జరిగిందన్న విషయాన్ని బాధితురాలిని ప్రశ్నించగా.. ఏడు నెలల క్రితం తాను బహిర్భూమికి వెళ్లినప్పుడు తనపై లైంగిక దాడి జరిగినట్లుగా చెప్పింది. దీంతో.. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఉదంతం గురించి విన్నంతనే.. ఇంత దారుణానికి పాల్పడిన వాడిని అస్సలు వదిలిపెట్టకూడదని మాత్రం అనిపించక మానదు. దేవుడా.. వాడిని మాత్రం వదిలిపెట్టకు.