ఐపీఎల్ టోర్నీ వేళ.. స్టార్ హోటళ్లలో బస వద్దట

క్యాలెండర్ మారినంతనే క్రికెట్ క్రీడాభిమానులు ముందుగా చూసేది ఐపీఎల్ టోర్నీ కోసమే. దాదాపు నెలన్నర పాటు సాగే ఈ టోర్నీ విశేషంగా ఆకట్టుకుంటుంది. దీంతో.. దీని విషయంలో ప్రత్యేకమైన అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు.

కరోనా కారణంగా షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ జరగని విషయం తెలిసిందే. తాజాగా ఈ టోర్నీని దుబాయ్ లో నిర్వహించాలని డిసైడ్ చేయటం తెలిసిందే. వేదికను డిసైడ్ చేయటం బాగానే ఉన్నా.. క్రీడాకారుల బస.. వారి ఆరోగ్యం.. కరోనా బారిన పడకుండా తీసుకునే జాగ్రత్తలకు సంబంధించిన బోలెడంత కసరత్తు తెర వెనుక జరుగుతోంది.

టోర్నీ సందర్భంగా వివిధ ఫ్రాంచైజీలు తమ జట్టు సభ్యుల్ని స్టార్ హోటళ్లలో బస కల్పించేందుకు ఇష్టపడటం లేదు. పలువురు ఆటగాళ్లు.. ఇప్పటికే ఈ విషయాన్ని తమ ఫ్రాంచైజీలకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

కరోనా భయాందోళనల వేళ.. ఆద్యంతం జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్న వారు.. స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేస్తే.. ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్టార్ హోటళ్లలో ఎయిర్ కండిషనింగ్ డక్ట్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందే వీలుందన్న ఆందోళనే దీనికి కారణం.

సహజంగానే స్టార్ హోటళ్లు అన్నంతనే పర్యాటకులతో పాటు.. అతిధులు.. పెద్ద ఎత్తున హోటళ్లలో బస చేస్తుంటారు. అలాంటి చోట తాము బస చేస్తే.. వైరస్ ప్రమాదం పొంచి ఉంటుందన్న ఆలోచనలో జట్టు సభ్యులు ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి పరిస్కారంగా.. గోల్ఫ్ రిసా్ర్టుల్లో రూములు బుక్ చేయాలని భావిస్తున్నారు.

నెలన్నర పాటు కుటుంబానికి దూరంగా ఉండటం ఆటగాళ్ల మానసిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుందని.. అందుకే.. గోల్ఫ్ రిసార్టుల్లో అయితే.. మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. అదే సమయంలో ప్రతి ఒక్క ఆటగాడికి విడిగా ఒక రూం కేటాయించటం కష్టం కాదంటున్నారు.

అంతేకాదు..ఈ టోర్నీ జరిగేంత వరకు.. ఆటగాళ్లకు చేరాల్సిన ఆహారం ఎక్కువ చేతులు మారకుండా.. తయారీ నుంచి నేరుగా కాంటాక్ట్ లెస్ డెలివరీ చేయాలని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే..కరోనా వేళ ఐపీఎల్ టోర్నీ నిర్వాహణ కత్తి మీద సాముగా మారిందని చెప్పక తప్పదేమో?