థాయ్ లాండ్ లో అడ్డంగా దొరికిపోయిన చికోటి గ్యాంగ్

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. క్యాసినో కింగ్ గా పేరున్న చికోటి ప్రవీణ్ ను థాయ్ లాండ్ లో అరెస్టు చేశారు. మొత్తం 90 మంది భారతీయ గ్యాంబ్లింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. థాయ్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పటాయాలోని టాస్క్ ఫోర్సు పోలీసులు ఈ అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ముఠాలో పద్నాలుగు మంది మహిళలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

వీరి నుంచి భారీగా నగదు.. గేమింగ్ చిప్స్ తో పాటు.. ఎనిమిది క్లోజ్డ్ సర్క్యుట్ టీవీ కెమేరాలు.. 92 మొబైల్ ఫోన్లు.. మూడు నోట్ బుక్ లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లుగా చెబుతున్నారు. థాయ్ లాండ్ లో నేరాలు రుజువైతే శిక్షలు కఠినంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలేం జరిగింది? ప్రవీణ్ అండ్ కోను అక్కడి పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? అసలేం జరిగిందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పలు మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఆధారంగా చూస్తే.. ఏప్రిల్ 27 నుంచి ఒక హోటల్లోని కాన్ఫరెన్సు హాల్ ను అద్దెకు తీసుకున్న ప్రవీణ్.. భారీ ఎత్తున గ్యాబ్లింగ్ నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక మహిళ కీ రోల్ ప్లే చేసిందని.. ఆమె ఎవరు? ప్రవీణ్ కు ఆమెతో ఉన్న లింకులు ఏమిటి? ఆమె ఎక్కడి వారు? పటాయాకు ఎప్పుడు వెళ్లారు? అక్కడేం చేస్తుంటారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.

పటయా పోలీసులు ప్రవీణ్ ను అతడి టీంను అదుపులోకి తీసుకునేందుకు టాస్క్ ఫోర్సు పోలీసులు ప్రయత్నించగా.. వారి నుంచి తప్పించుకునేందుకు విఫల ప్రయత్నం చేశారని చెబుతున్నారు. అయినప్పటికీ వారు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల పహరాలో పలువురు భారతీయులతో పాటు స్టూల్ మీద కూర్చున్న చికోటి ప్రవీణ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చూసినంతనే ప్రవీణ్ ను గుర్తించేలా ఉన్న ఈ ఫోటో ఇప్పుడు సంచలనంగా మారింది. అక్కడి పోలీసుల అదుపులో ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డి.. డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అసలేం జరిగింది? అన్న వివరాల కోసం పలు మీడియా సంస్థలు ప్రవీణ్ కు.. అతని ముఖ్యులకు ఫోన్లు చేయగా.. వారి ఫోన్లు రింగ్ అవుతున్నా.. ఎవరూ కాల్ ఎత్తి మాట్లాడకపోవటం గమనార్హం.