పేప‌ర్ లీకేజీ కోసం.. కారు అమ్మేశారు

తెలంగాణ‌లో లీకు వీరులు సృష్టించిన తుఫాను.. మ‌రిన్ని దిశ‌లుగా ప‌య‌నిస్తోంది. తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నియామ‌కాల‌కు సంబంధించి పేప‌ర్లు లీక్ అయిన వ్య‌వ‌హారం.. అన్నివైపుల నుంచి విస్మ‌యానికి గురి చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురిని అదుపులోకి తీసుకోవ‌డం తెలిసిందే. అయితే.. తోడుతున్న కొద్దీ.. నీరు ఊరిన‌ట్టు.. ఈ కేసులో విచార‌ణ చేస్తున్న కొద్దీ విస్మ‌యం క‌లిగించే విష‌యం వెలుగు చూస్తున్నాయి.

పేప‌ర్ లీకు కుంభ‌కోణంలో ఖమ్మం ప్రాంతానికి చెందిన దంపతులు సాయిలౌకిక్‌, సుస్మితల నుంచి ల్యాప్‌టాప్‌, ప్రశ్నపత్రం స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి రాబ‌ట్టిన స‌మాచారం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఖమ్మం ప్రాంతానికి చెందిన పాతకార్ల వ్యాపారి సాయిలౌకిక్‌ డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(డీఏవో) ప్రశ్నపత్రం కొనుగోలు చేసేందుకు ప్ర‌ధాన నిందితుడు ప్రవీణ్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు.

దానికోసం సాయిలౌకిక్ కారును అమ్మేశాడు. ఇలా అమ్మేయ‌గా వ‌చ్చిన 6లక్షల సొమ్మును నిందితుడు ప్రవీణ్‌ బ్యాంకు ఖాతాలో వేశారు. మిగిలిన మ‌రో 4 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను పరీక్ష రాశాక ఇస్తానంటూ సాయి లౌకిక్ ఫిబ్రవరి 23న డీఏఓ ప్రశ్నపత్రం తీసుకున్నాడు. అదే నెల 26న డీఏఓ పరీక్ష రాశారు. ఆ తర్వాత మార్చి 11న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ విషయం బయటపడడం తెలిసిందే.

విచార‌ణ‌కు స‌హ‌క‌రించడంతో..

ఈ లీకుల బాగోతంలో కొస‌మెరుపు ఏంటంటే.. సాయిలౌకిక్, సుస్మిత దంపతులు పోలీసుల విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డ‌మే. దీంతో కేసు దాదాపు ఒక కొలిక్కి వ‌చ్చింద‌ని ఆఫ్ ది రికార్డుగా పోలీసులు చెబుతున్నారు. లీకేజీ దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు అయిన ప్రవీణ్‌ బ్యాంకు ఖాతాలను పరిశోధించినప్పుడు సాయిలౌకిక్‌ ద్వారా రూ.6 లక్షలు వచ్చినట్లు వెల్లడవడంతో డీఏఓ ప్రశ్నపత్రం కూడా విక్రయించినట్టు సిట్‌ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయంపై కస్టడీ సమయంలో ఆ దంపతులు తామే ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్టు అంగీకరించారు. మొత్తానికి లీకుల వ్య‌వ‌హారం ఇంకెన్ని మ‌లుపులు తిరుగుతుందోన‌ని పోలీసులు చెబుతున్నారు.