డెయిరీలో భారీ పేలుడు.. 18వేల ఆవులు మృత్యువాత

ఘోరాతి ఘోరమైన ఉదంతం అగ్రరాజ్యమైన అమెరికాలో చోటు చేసుకుంది. ఒక డెయిరీ లో చోటు చేసుకున్న భారీ పేలుడుకు వేలాది గోవులు మృత్యువాత పడ్డాయి. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డిమ్మిట్ లో ఉన్న సౌత్ ఫోర్క్ డెయిరీ ఫాంలో భారీ పేలుడు చోటు చేసుకుంది.

ఈ ఉదంతంలో 18వేల ఆవులు ఒకేసారి మృత్యువాత పడిన అసాధారణ ఉదంతం చోటు చేసుకుంది. ప్రాణాలు కోల్పోయిన ఆవుల విలువ 36 మిలియన్ డాలర్లు (మన రూపాయిల్లో రూ.294 కోట్లు) ఉంటుందని చెబుతున్నారు.

దాదాపు పదేళ్ల తర్వాత ఇంత భారీ ప్రమాదం ఒక డెయిరీ ఫారంలో చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. 2013లో ఇలాంటిదే ఒకటి చోటు చేసుకుందని.. ఆ తర్వాత ఇదేనని చెబుతున్నారు. ఇంతకీ ఈ భారీ పేలుడు వెనుక కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు అధికారులు బదులిస్తూ.. డెయిరీ ఫారంలోని యంత్రాలు బాగా వేడెక్కిపోవటంతోనే పేలుడు సంభవించినట్లుగా భావిస్తున్నారు. పేలుడు వేళ.. మిథేన్ అధిక మొత్తంలో విడుదలైందని.. దీంతో ఆవులు భారీ ఎత్తున మృత్యువాత పడ్డాయని చెబుతున్నారు.

డెయిరీ ఫారాల్లో మిథేన్ వాయువు అధికంగా వెలువడుతుందని.. పేడ ఎక్కువగా నిల్వ ఉండటం ద్వారా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అయితే.. ఇంత భారీ పేలుడు వెనుక అసలు కారణం ఏమిటన్న విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉందంటున్నారు. మరి.. ఇంత భారీ పేలుడు జరిగిన వేళలో.. ప్రాణ నష్టం లేదా? అంటే.. లేదనే చెబుతున్నారు. కారణం.. అమెరికా లాంటి దేశాల్లో భారీ ఎత్తున యంత్రాల సాయంతో డెయిరీలను నిర్వహిస్తూ ఉంటారని చెబుతున్నారు.

సాధారణంగా 15వేల కంటే ఎక్కువగా గోవులను పెంచే డెయిరీ ఫాంను బార్ గా వ్యవహరిస్తారని.. ఇలాంటి చోట్ల అన్ని పనులను యంత్రాలతో చేయిస్తారని చెబుతున్నారు. ఏదైనా సమస్య ఏర్పడితే.. వాటిని సరిదిద్దేందుకు నామ మాత్రంగా సిబ్బంది ఉంటారని తెలుస్తోంది. ఈ కారణంగానే ఇంత భారీ పేలుడు చోటు చేసుకున్నా ప్రాణ నష్టం లేకపోవటానికి కారణంగా అభిప్రాయపడుతున్నారు.

పేలుడు ఒక్కసారిగా చోటు చేసుకోవటం.. మంటలు పెద్ద ఎత్తున ఏర్పడటంతో వాటిని అదుపు చేయటం కుదర్లేదని చెబుతున్నారు. మూగజీవాలు వేలాదిగా మరణించటం విషాదమే అయినా.. ఇంత భారీ పేలుడుకు ప్రాణ నష్టం లేకపోవటం ఊరట కలిగించే అంశంగా చెబుతున్నారు. అయితే.. పాలను భద్రపరిచే గదిలో ఒక మహిళ చిక్కుకుపోయిందని.. ఆమె గాయాలతో బయటపడినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఈ భారీ పేలుడు వెనుక ఏం జరిగిందన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.