44 కోట్ల లాట‌రీ.. ప్రాంక్ కాల్ అనుకుని ఫోన్ క‌ట్ చేశాడు..

సిరితా వ‌చ్చిన వ‌చ్చును… అని మ‌న తెలుగు ప‌ద్యం చెప్పిన‌ట్టుగానే.. ఒక వ్య‌క్తికి.. ఏకంగా 44 కోట్ల రూపాయ‌ల లాట‌రీ ద‌క్కింది. అయితే.. ఇది వ‌స్తుందని కానీ, తాను రాత్రికి రాత్రి కోటీశ్వ‌రుడిని అవుతాన‌ని కానీ, స‌ద‌రు వ్య‌క్తి భావించ‌లేదు. దీంతో ఆ.. ఏముంది.. ఇదంతా ప్రాంక్‌ అనుకున్నాడు. కానీ, వ‌చ్చింది సాక్షాత్తూ సిరి మ‌హాల‌క్ష్మి!! అదృష్టం బాగుంది కాబ‌ట్టి.. స‌ద‌రు వ్య‌క్తిని వ‌రించింది. లేకుంటే.. కొంచెంలో త‌ప్పిపోయేది. మ‌రి ఈ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందంటే..

క‌ర్ణాట‌క‌లోని బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ వ‌ట‌క్కే అనే వ్య‌క్తి ఉద్యోగి. అయితే.. ఈయ‌న‌కు కొంత లాట‌రీల పిచ్చి ఉంది. దీంతో అప్పుడ‌ప్పుడు ఆన్‌లైన్‌లో విదేశీ లాట‌రీ టికెట్ల‌ను కొనుగోలు చేస్తుంటాడు. ఇలానే.. గ‌త నెల‌లో రూ.250 పెట్టి దుబాయ్‌కు చెందిన ఒక లాట‌రీ టికెట్ కొన్నాడు. `ఆ.. ఏముంది.. ఎప్పుడూ కొనేదేగా“ అనుకున్నాడు. కానీ, అనూహ్యంగా అత‌నికి లాట‌రీ త‌గిలింది. ఏకంగా.. 44 కోట్ల రూపాయ‌లు(20 మిలియ‌న్ ధిరామ్‌) గెలుచుకున్నాడు. ఏప్రిల్ 3వ తేదీన లైవ్ షోలో లక్కీ డ్రా ద్వారా లాటరీ విజేతను ప్రకటించారు.

త‌ర్వాత ఏం జ‌రిగింది..

అరుణ్‌కుమార్‌కు.. లాటరీ గెలుచుకున్నారని కాల్ వచ్చింది. దాన్ని ప్రాంక్‌గా భావించిన ఆయన.. ఆ నంబర్ను బ్లాక్ చేశారు. అయితే హోస్ట్లు మరో నంబర్ ద్వారా కాల్ చేసి చెప్పిన తర్వాతే ఆ విషయాన్ని నమ్మారు అరుణ్. “బిగ్ టికెట్ నుంచి కాల్ వచ్చినప్పుడు మొదట నేను అది ఫేక్ కాల్ అనుకున్నా. ఎవరైనా ప్రాంక్ కాల్ చేసి ఉండొచ్చని భావించా. నేను ఆ కాల్ డిస్‍కనెక్ట్ చేసి.. ఆ నంబర్‌ను బ్లాక్ చేశాను. వెంటనే వేరే నంబర్‌ నుంచి నాకు కాల్ వచ్చింది” అని అరుణ్ కుమార్ తెలిపారు.

రెండోసారి ఫోన్ కాల్ వచ్చిన తర్వాతనే అరుణ్ తనకు లాటరీలో మొదటి ప్రైజ్ వచ్చిందన్న విషయాన్ని నమ్మారు. తాను లాటరీ టికెట్ కొనుగోలు చేయడం రెండవసారి అని అరుణ్ వెల్లడించారు. అయితే.. లాట‌రీ మొత్తంలో 50 శాతం ప‌న్నులు క‌ట్టాల్సి ఉంటుంద‌ని.. త‌న‌కు 22 కోట్లు అందుతాయ‌ని.. త‌న జీవితంలో ఇంత సొమ్ము ల‌భించ‌డం.. ఇదే తొలిసారి అని వెల్ల‌డించాడు.