ఎక్స్‌ట్రా చేస్తే.. కెప్టెన్సీ నుంచి త‌ప్పుకొంటా

ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నాలుగుసార్లు ఛాంపియన్‌ అయిన చెన్నై సూపర్‌కింగ్స్‌.. 16వ సీజన్‌లో బోణీ కొట్టింది. 12 పరుగుల తేడాతో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ను ఓడించింది. 218 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన లఖ్నవూలో.. మేయర్స్‌ ఉన్నంతసేపు ఛేదన కష్టమేమీ కాదనే అనిపించింది. తమ ఫస్ట్ మ్యాచ్లో దిల్లీపై చెలరేగిపోయిన ఈ విండీస్‌ వీరుడు.. చెన్నై మీదా కూడా అదే దూకుడు ప్రదర్శించాడు. దొరికిన బంతిని దొరికినట్లుగా బాదుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అయితే.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. తమ బౌలర్లకు  గట్టి వార్నింగ్ ఇవ్వ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

ఎక్స్‌ట్రా‌లు ఎక్కువగా ఇస్తుండటం వల్ల వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. గత రాత్రి(ఏప్రిల్ 3) చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా లఖ్నవూతో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో సీఎస్కే విజయాన్ని సాధించింది. అయితే ఈ విజయం.. బ్యాటర్ల భారీ స్కోరు చేయడంతో దక్కింది. బౌలర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో బౌలర్ల ప్రదర్శనపై దోనీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

నోబాల్స్, వైడ్స్ తక్కువగా వేసేందుకు ప్రయత్నించాలని.. లేదంటే ఇకపై కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో ఆడాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాడు. కాగా, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్లు మొత్తం 18 ఎక్స్‌ట్రాలు వేశారు. ఇందులో రెండు లెగ్‌బైస్‌, 13 వైడ్లు, మూడు నోబాల్స్‌ ఉన్నాయి. వీరిలో బౌలర్‌ తుషార్‌ దేశ్‌పాండే మూడు నోబాల్స్‌ వేశాడు.

“ఫాస్ట్‌ బౌలింగ్‌ను మేం బాగా మెరుగుపరుచుకోవాలి. పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్‌ చేయాలి. ప్రత్యర్థి బౌలర్లు ఏం చేస్తున్నారు, వారి వ్యూహాలు ఏంటి అనేది కూడా గమనించడం ఇక్కడ చాలా ముఖ్యం. ముఖ్యంగా బౌలర్లు నోబాల్స్‌ వేయకుండా బంతులను సంధించాలి. ఎక్స్‌ట్రా వైడ్లు తగ్గించాలి. ఈ మ్యాచ్‌లో మేం అదనపు పరుగులు ఎక్కువగా ఇచ్చేశాం. వాటిని తగ్గించాలి. లేదంటే ఇక కొత్త కెప్టెన్సీలో మా జట్టు ఆడుతుంది. ఇది నా సెకండ్ వార్నింగ్‌. ఇకపై ఇదే తప్పు జరిగితే సారథ్యం నుంచి తప్పుకుంటా” అని మహీ హెచ్చరించాడు.