ద‌ర్శ‌కుడి సొంత ఊర్లో వీర‌సింహారెడ్డి ఈవెంట్‌

ఏ ద‌ర్శ‌కుడికైనా త‌న అభిమాన హీరోతో సినిమా తీసే అవ‌కాశం వ‌స్తే ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. ఆ సినిమాను చాలా ప్ర‌త్యేకంగా భావిస్తారు. దాన్నొక మైలురాయిలా తీర్చిదిద్దాల‌ని, బ్లాక్‌బ‌స్ట‌ర్ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని కూడా ఇప్పుడు ఆ ప్ర‌య‌త్నంలోనే ఉన్నాడు.

నంద‌మూరి బాల‌కృష్ణకు తాను వీరాభిమాని అని ఆయ‌న‌తో సినిమా క‌న్ఫ‌మ్ కావ‌డానికి ముందు నుంచే చెబుతూ వ‌చ్చాడు గోపీచంద్. క్రాక్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌డంతో అత‌డికి బాల‌య్య‌తో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. వీరి క‌ల‌యిక‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ వీర‌సింహారెడ్డి సినిమాను నిర్మిస్తోంది.

సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. త‌న కెరీర్లో, జీవితంలో అత్యంత ప్ర‌త్యేక‌మైన సినిమా కావ‌డంతో ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌ను మ‌రింత ప్ర‌త్యేకంగా మార్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు గోపీచంద్.

వీర‌సింహారెడ్డి ప్రి రిలీజ్ ఈవెంట్‌ను త‌న సొంత‌గ‌డ్డ అయిన ఒంగోలులో చేయించేందుకు హీరో, నిర్మాత‌ల‌ను అత‌ను ఒప్పించాడు. జ‌న‌వ‌రి 6న ఈ ఈవెంట్ ఒంగోలులో జ‌ర‌గ‌బోతోంది. ఈ విష‌యాన్ని సినిమాలోని మా బావ మ‌నోభావాలు పాట లాంచ్ సంద‌ర్భంగా స్వ‌యంగా గోపీచందే వెల్ల‌డించాడు.

హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఒక థియేట‌ర్లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో.. అభిమానులు బాల‌య్య డైలాగ్స్ చెప్ప‌మంటూ గొడ‌వ చేస్తుంటే.. వారికి గోపీచంద్ స‌ర్ది చెప్పాడు. జ‌న‌వ‌రి 6న ఒంగోలులో ప్రి రిలీజ్ ఈవెంట్ జ‌రుగుతుంద‌ని.. అందులో బాల‌య్య సినిమాలోని మాస్ డైలాగులు చెబుతార‌ని వారిని స‌ముదాయించాడు.

మొత్తానికి ప్రి రిలీజ్ ఈవెంట్ గురించి అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌ముందే విష‌యం గోపీచంద్ ఇలా లీక్ చేసేశాడు. ఏదైతేనేం త‌న అభిమాన క‌థానాయకుడితో తీసిన సినిమా ఈవెంట్‌ను త‌న సొంత ఊర్లో చేసుకోవ‌డం గోపీచంద్‌కు చాలా ప్ర‌త్యేక‌మే.