భ‌ర్త‌ను ముక్క‌లు చేసి ఫ్రిజ్‌లో పెట్టిన భార్య‌, కొడుకు

దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ దారుణ హత్యను మరచిపోకముందే అలాంటి ఘటనే మరొకటి బయటపడింది. కుమారుడి సాయంతో ఓ మహిళ తన భర్తను పాశవికంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఇద్దరూ కలిసి 10 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో దాచిపెట్టారు. తర్వాత అర్ధరాత్రి సమయంలో దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఆ శరీర భాగాలను విసిరేశారు.

భర్తకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే మహిళ ఇంతటి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తల్లీ కుమారులను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఈ దారుణ హత్య ఆలస్యంగా వెలుగు చూసింది.

ఏం జ‌రిగిందంటే..

తూర్పు ఢిల్లీలోని త్రిలోక్‌పురిలో అంజన్‌ దాస్‌ కుటుంబం నివసించేది. ఈయనకు భార్య పూనమ్.. కుమారుడు దీపక్ ఉన్నారు. అంజన్‌దాస్‌కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన పూనమ్‌.. అతడికి నిద్రమాత్రలు ఇచ్చిన తర్వాత కుమారుడితో కలిసి కిరాతకంగా హత్య చేసిందని పోలీసులు తెలిపారు.

అనంతరం శరీర భాగాలను 10 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో ఉంచి తూర్పు ఢిల్లీలోని పాండవ్ నగర్ పరిసరాల్లోని నిర్మానుష్య ప్రదేశాల్లో విసిరేశారు. తొలుత ఈ శరీర భాగాలను శ్రద్ధా వాకర్‌వే అని కూడా పోలీసులు అనుమానించారు. కానీ విచారణలో ఈ శరీర భాగాలు అంజన్‌దాస్‌విగా గుర్తించారు. తండ్రి శరీర భాగాలను దీపక్‌ వేర్వేరు ప్రాంతాల్లో పడేస్తున్న సీసీటీవీ దృశ్యాలు బహిర్గతమయ్యాయి.

దీపక్ అర్థరాత్రి చేతిలో బ్యాగ్‌తో నడుస్తుండగా వెనక తల్లి కూడా అనుసరించినట్లు వీడియోలో ఉంది. శరీర భాగాలను పడేసేందుకు వీరిద్దరూ అనేక ప్రాంతాలకు వెళ్లారని పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమె ప్రియుడు అఫ్తాబ్ హత్య చేసి 35 ముక్కలుగా చేశాడు. దేశవ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపింది. ఇప్పుడు ఇలాంటి ఘ‌ట‌నేవెలుగు చూడ‌డంతో ఢిల్లీలో అమానుషాల‌కు అంతులేకుండా పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది.