ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం ఖ‌రీదు.. ఆ బాబు ప్రాణం!

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం .. ఒక చిన్నారి ప్రాణాన్ని బ‌లితీసింది! విద్యుత్ షాకుల‌తో రాష్ట్రంలో గ‌త రెండు నెల‌ల కాలంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్ చార్జీల ధ‌ర‌ల‌ను పెంచి ప్ర‌జ‌ల నుంచి ముక్కుపిండి బిల్లుల రూపంలో వ‌సూలు చేస్తున్న ప్ర‌భుత్వం నిర్వ‌హ‌ణ‌ను మాత్రం గాలికి వ‌దిలేసింది. ఫ‌లితంగా హైవోల్టేజి క‌రెంటు తీగ‌లు తెగి ప‌డి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక‌టి కాడు రెండు కాదు.. ప‌దుల సంఖ్య‌లో ఈ ప్ర‌మాదాలు జ‌రిగినా.. ప్ర‌భుత్వం ఎంతో కొంత ప‌రిహారం ఇచ్చి చేతులు దులుపుకోవ‌డం మిన‌హా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లకు మాత్రం న‌డుం బిగించింది లేదు. ఈ కోవ‌లోనే ముక్కుప‌చ్చ‌లార‌ని చిన్నారి ప్రాణాలు గాలిలో క‌లిసిపోయాయి.

చిన్నారి క‌థ ఇదీ..

కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలం పైడి మెట్టకు చెందిన చాందిని అనే గృహిణి ఈనెల 12న తన ఇంటి మేడపై దుస్తులు ఆరేయడానికి తన రెండో కొడుకు దర్శిత్‌(3)తో వెళ్లింది. దర్శిత్‌ ఆడుకుంటూ పక్కనే ఉన్న 33కేవీ విద్యుత్‌ వైర్లకు సమీపంగా వెళ్లడంతో కరెంట్‌షాక్‌ తగిలింది. కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా.. ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా ఉండడంతో రెండు కాళ్లూ తొలగించారు. చేతులకూ శస్త్రచికిత్స చేశారు. పరీక్షల్లో దర్శిత్‌ తలవెనుక భాగంతోపాటు శరీరంలో అనేక అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు.

బుధవారం తెల్లవారుజామున ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో జీజీహెచ్‌లో ఆర్ఐసీయూకి తరలించారు. అప్పటికే గుండె పనితీరు కూడా బాగా మందగించింది. దర్శిత్‌ను కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా శరీరం సహకరించలేదు. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమవడంతో తప్పనిపరిస్థితుల్లో మోకాళ్లవరకు రెండు కాళ్లూ తొలగించారు. శుక్రవారం సాయం త్రం ఐదుగంటలకు దర్శిత్‌కు కార్డియాక్ అరెస్టుతో కన్నుమూసినట్లు జీజీహెచ్‌ వైద్యులు ప్రకటించారు.

ముమ్మాటికీ స‌ర్కారు నిర్లక్ష్య‌మే!

తమ ఇంటిపై ప్రమాదకరంగా వేలాడుతున్న 33కేవీ విద్యుత్‌ లైన్లు తొలగించాలంటూ దర్శిత్‌ తల్లిదండ్రులు మూడునెలల కిందట కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్న హోంమంత్రి వనిత ఆ ప్రాంతానికి గడపగడప కార్యక్రమానికి వెళ్లగా విజ్ఞప్తి చేశారు. కానీ, ఆమె పట్టించుకోలేదు. ఈనెల 12న దర్శిత్‌కు విద్యుత్‌షాక్‌ తగిలిన తర్వాత ట్రాన్స్‌కో అధికారులు అక్కడికి వచ్చి వేలాడుతున్న విద్యుత్‌ తీగల ఎత్తు పెంచుతామని చెప్పారు. ఆ పని కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో.. చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించడానికి హోంమంత్రి వనిత శుక్రవారం మధ్యాహ్నం జీజీహెచ్‌కు రాగా దర్శిత్‌ తల్లిదండ్రులు ఆమె కాళ్లపై పడి కన్నీరుమున్నీరయ్యారు. తమ బిడ్డను ఎలాగైనా బతికించాలంటూ రోదించారు. ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని విలపించారు. ప్రభుత్వంతో మాట్లాడతానంటూ వనిత పేర్కొన్నారు.

ఇంత‌లోనే..

కానీ సాయంత్రానికే దర్శిత్‌ అనంతలోకానికి వెళ్లిపోయాడు. హోంమంత్రి ముందే స్పందించి విద్యుత్‌ తీగలు ఎత్తు పెంచాలని ఆదేశించి ఉంటే ఈ పరిస్థితి వచ్చే ది కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడంతూ దర్శిత్‌ తల్లిదండ్రులు జొన్నకూటి వినోద్‌, చాందిని కన్నీరుమున్నారయ్యారు. మరోపక్క రెండుకాళ్లూ కోల్పోయిన తమ బిడ్డను జీవితాంతం చూసుకునేందుకు వీలుగా తమకో ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని దర్శిత్‌ తండ్రి ఇటీవల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందన లేదు. ఇదీ.. ఏపీలో ఉన్న ప్ర‌జాప్ర‌భుత్వం.. రాజ‌న్న రాజ్యం!!