ఆ ట్యాబ్లెట్ల కోసం ఏపీలో అంతలా ఎగబడుతున్నారట

ఏ పుట్టలో ఏ పాము ఉందన్న రీతిలో.. మాయదారి కరోనాను అడ్డుకునేందుకు.. తమ వరకు రాకుండా ఉండాలన్న తలంపు ఇప్పుడు ప్రజల్లో ఎక్కువ అవుతోంది. దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్న కేసుల తీవ్రత ప్రజల్ని హడలెత్తిస్తోంది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమన్నట్లుగా ప్రజలు వ్యవహరిస్తున్నారు. రెండు తెలుగురాష్ట్రాల ప్రజల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు.

గడిచిన కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో మాత్రం ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో కేసుల నమోదు కాస్త తగ్గిన పరిస్థితి. కరోనా సోకకుండా ఉండేందుకు రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలపై సోషల్ మీడియాతో పాటు.. వాట్సాప్ మెసేజ్ లలో వస్తున్న పోస్టులకు ప్రభావితమవుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది.

కరోనా సోకకుండా ఉండేందుకు విటమిన్ ట్యాబ్లెట్లు.. బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు వాడితే మంచిదన్న అభిప్రాయం పెరుగుతోంది. దీంతో.. విటమిన్ డీ3 మాత్రల్ని విపరీతంగా కొంటున్నారు. దీంతో పాటు బీ కాంప్లెక్స్ మాత్రలతో పాటు.. సీ విటమిన్ మాత్రల్ని వాడుతున్నారు. దీంతో.. వీటి డిమాండ్ పెరుగుతోంది. తెలంగాణలో ఒకట్రెండు రకాల ట్యాబ్లెట్లు తప్పించి.. మిగిలిన మాత్రలు దొరుకుతున్నాయి.

ఏపీలో మాత్రం అందుకుభిన్నంగా విటమిన్ ట్యాబ్లెట్ల కొరత ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం పాతిక వేల మెడికల్ షాపులు ఉంటే.. అందులో 70 శాతం షాపుల్లో విటమిన్ ట్యాబ్లెట్ల కొరత ఉన్నట్లు చెబుతున్నారు. ప్రజల్లో ఉన్న డిమాండ్ అసరా చేసుకొని.. ఎక్కువ రేట్లకు అమ్ముతున్న వారు లేకపోలేదు.

ఇదిలా ఉంటే.. విటమిన్ ట్యాబ్లెట్ల వినియోగంతో పెద్దగా ప్రయోజనం ఉండదని పలువురు వైద్యులు చెబుతున్నారు. ట్యాబ్లెట్ల కంటే కూడా సహజసిద్ధంగా వచ్చే విటమిటన్లే శరీరానికి మంచిదని చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్నారు. పండ్లు.. ఆకుకూరలతో అన్ని రకాల విటమిటన్లు లభిస్తాయని చెబుతున్నారు. అందరి మాదిరి విటమిన్ ట్యాబ్లెట్ల కోసం ఎగబడే కన్నా.. మంచి ఆహారాన్ని ఎంపిక చేసుకొని తీసుకోవటం మంచిదన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.