క‌రోనా క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ స‌క్సెస్

క‌రోనాకు వ్యాక్సిన్‌, మందు కనుగొనే దిశ‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌రిశోధ‌న‌లు జోరుగా సాగుతున్నాయి. ఇండియాలో భార‌త్ బ‌యోటెక్ సంస్థ క‌రోనాకు వ్యాక్సిన్ త‌యారు చేసి మ‌నుషుల మీద ప్ర‌యోగించే ద‌శ‌లో ఉంది.

కుదిరితే ఇంకో నెల‌లోపు ఈ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసి ఆగ‌స్టు 15 క‌ల్లా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తేవాల‌న్న ల‌క్ష్యంతో ఆ సంస్థ ప‌ని చేస్తోంది. ఈలోపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాలు క‌రోనా వ్యాక్సిన్ మీద ముమ్మ‌ర ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతూ.. వివిధ ద‌శ‌ల్ని దాటే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. తాజాగా ర‌ష్యా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తెచ్చే దిశ‌గా కీల‌క ముంద‌డుగు వేసింది.

ర‌ష్యాలోని సెచెనోవా యూనివర్సిటీ ఆధ్వర్యంలో తయారుచేసిన క‌రోనా వ్యాక్సిన్ క్లినికల్‌ ట్రయల్స్ విజయవంతమయ్యాయని ప్రకటించారు. సెచెనోవ్ ఫస్ట్ మాస్కో స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో.. వాలంటీర్లపై తొలి వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైందని.. ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్ అండ్ బయోటెక్నాలజీ డైరెక్టర్ వాడిమ్ తారాసోవ్ ఓ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీస్‌తో తెలిపారు.

క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న తొలి బృందం.. బుధవారం నాడు డిశ్చార్జ్‌ కానుందని.. ఇక రెండో బృందం జూలై 20 వ తేదీన డిశ్చార్జ్ అవుతుంద‌ని తెలిపారు. రష్యాలోనే మాస్కోకు చెందిన గమలీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ తయారు చేసిన వ్యాక్సిన్‌ కూడా క్లినికల్ ట్రయల్స్‌ను గత నెల జూన్ 18న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐతే ఆయా దేశాల్లో వ్యాక్సిన్‌లు ఆమోదం పొంది మార్కెట్లోకి వ‌చ్చినా.. అవి అంత‌ర్జాతీయంగా, ఇత‌ర దేశాల్లో ఆమోదం పొంది.. అక్క‌డి మార్కెట్ల‌లోకి వెళ్ల‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది.