పిల్ల‌ల్ని క‌న‌డంపై నియంత్ర‌ణ‌.. కేంద్రం కొత్త చ‌ట్టం

దేశంలో జ‌నాభా పెరిగిపోతోంది. వచ్చే ఏడాది నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనా ను దాటి భారత్‌ నిలవనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘2022 ప్రపంచ జనాభా అంచనాల’ నివేదికను విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే దేశంలో జ‌నాభా నియంత్ర‌ణ‌కు మోడీ స‌ర్కారు న‌డుం బిగించింది. దేశంలో ఒక‌రు లేదా.. ఇద్ద‌రు మాత్ర‌మే పిల్ల‌ల్ని క‌నేలా.. చ‌ట్టం తీసుకువ‌స్తున్నారు.

వాస్త‌వానికి ఇందిర‌మ్మ ప్ర‌భుత్వ కాలం నుంచి కూడా “ఒక్క‌రు ముద్దు.. ఇద్ద‌రు హ‌ద్దు!” నినాదంతో జ‌నాభా నియంత్ర‌ణ‌పై పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. అయితే.. త‌ర్వాత‌.. ఆడ‌పిల్ల‌ల సంఖ్య భారీగా త‌గ్గిపోయింది. దీంతో ఈ నినాదాన్ని ప‌క్క‌న పెట్టి.. ఆడ‌పిల్ల‌ల‌ను క‌నే త‌ల్లిదండ్రుల‌కు రాష్ట్రాలు ప్రోత్సాహ‌కాలు ఇవ్వాల‌ని ప్ర‌క‌ట‌న చేశారు. ఈ క్ర‌మంలోనే కొన్ని ప‌థ‌కాలు కూడా వ‌చ్చాయి. అయితే.. ఇప్పుడు మ‌రోసారి.. జ‌నాభా పెరిగిపోతున్న ప‌రిస్థితి తెర‌మీదికి వ‌చ్చింది.

అయితే.. దీనిని నినాదాల‌తో కాకుండా.. చ‌ట్టంతో నియంత్రించాల‌నేది మోడీ స‌ర్కారు యోచ‌న‌.. ఈ క్ర‌మంలోనే తొలిసారి దేశంలో జ‌నాభా నియంత్ర‌ణ‌కు బిల్లును రూపొందించారు. దీనిని ప్ర‌స్తుత వ‌ర్షాకాల‌ స‌మావేశాల్లోనే ఆమోదించుకుని.. అమ‌లు చేయాల‌ని కూడా నిర్ణ‌యించుకున్నారు. దీని ప్ర‌కారం.. దేశంలో ఏ కుటుంబ‌మైనా.. ఈ ఏడాది నుంచి ఒక‌రు లేదా ఇద్ద‌రు పిల్ల‌ల‌ను మాత్ర‌మే క‌నేందుకు అవ‌కాశం ఉంటుంది. అంత‌కు మించితే.. ఏం చేస్తార‌నేది.. చూడాలి.

అయితే.. లౌకిక‌, ప్ర‌జాస్వామ్య దేశంగా పేరున్న భార‌త్‌లో ఇలా.. నిర్బంధ కుటుంబ నియంత్ర‌ణ సాధ్య‌మేనా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. కొన్ని మ‌తాలు..కులాల‌ను గ‌మ‌నిస్తే.. వారిలో కుటుంబ నియంత్ర‌ణ అనేది త‌ప్పుగా ప‌రిగ‌ణిస్తున్నారు. ముఖ్యంగా గిరిజ‌నులు.. సిక్కులు, జైనులు ఇత‌ర మ‌త‌స్తుల్లో ఈ ఆచారం ఉంది. ఈ నేప‌థ్యంలో మోడీ తీసుకువ‌చ్చే ఈ బిల్లు.. ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంది? ఎలా ముందుకు తీసుకువెళ్తారు? అనేది చూడాలి.