సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్… ఈ పేరు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. కుర్రకారు అయితే దీని గురించి మరింత ఎక్కువగా చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే దీనిపై ఓ రేంజి చర్చే జరుగుతోంది. ఏంటీ.. ముఖం కడుక్కోవడానికి వాడే క్రీమ్ గురించి సోషల్ మీడియాలో ఇంతగా చర్చ జరుగుతుందా? అంటే…అవును జరుగుతోంది. అప్పుడప్పుడే టీనేజీలోకి అడుగుపెట్టిన వారయితే దీని గురించి మరింత ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
సరే.. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఫేస్ వాష్ క్రీమ్ గురించి ఇంత పెద్ద చర్చ ఎందుకు జరుగుతున్నదన్న విషయంలోకి వెళ్లిపోదాం పదండి. టీనేజీలోకి అడుగుపెట్టే వారంత ముఖంపై మొలిచే మొటిమలతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇక కాలేజీలకు వెళ్లే అమ్మాయిలైతే మరింత ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. ఈ మొటిమల నుంచి ఉపశమనం కోసం మార్కెట్లో అందుబాటులో ఉండే ఫేస్ వాష్ లను ఇట్టే వాడేస్తుంటారు. ఇందుకోసం ఒక్కో క్రీమ్ కోసం వారు ఏకంగా రూ.150 నుంచి రూ.300 దాకా వెచ్చిస్తుంటారు. అయినా ఆయా క్రీముల ద్వారా అంతగా ఫలితం ఉంటుందా? అంటే అనుమానమే.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న జన్ ఔషది కేంద్రాల్లో సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ విడుదలైంది. దీని గురించి కేంద్రమే ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. మొటిమల నుంచి ఉపశమనం కావాలంటే…జన ఔషది కేంద్రాల్లోని సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ ను వాడండి అని చెప్పడంతో పాటుగా దాని ధరలను గురించి కూడా కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు గుప్పించింది. అంతే ఒక్కసారిగా దీనిపై చర్చకు తెర లేసింది.
ఈ క్రీమ్ పై ఇంత చర్చ ఎందుకూ అంటే… దాని ధర గురించే ఈ చర్చ నడుస్తోంది. ఈ క్రీమ్ లలో ఇతర ప్రైవేట్ కంపెనీల క్రీమ్ లు ఒక్కోటి రూ.150 కంటే అధిక ధరలకే లబిస్తుంటే… జన ఔషది క్రీమ్ మాత్రం కేవలం రూ.46.88 మాత్రమే. ఈ క్రీమ్ రెండు వేరియంట్లలో లభిస్తుంటే.. 1 శాతం సాలిసిలిక్ యాసిడ్ ఉన్న క్రీమ్ ధర రూ.46.88 అయితే… 2 శాతం యాసిడ్ ఉన్న ధర కూడా కేవలం రూ.65.63 మాత్రమే. హీనపక్షం రూ.150కి దొరికే ఈ క్రీమ్ ఇప్పుడు కేవలం అందులో మూడోవంతు రేటుకు మాత్రమే దొరుకుతుంటే… దానిపై ఈ రేంజిలో చర్చ జరగడం సహజమే కదా.
Gulte Telugu Telugu Political and Movie News Updates