వ‌ర్క్ ఫ్రం ద్వారా జ‌రుగుతున్న పెద్ద న‌ష్టం ఏంటంటే…

వ‌ర్క్ ఫ్రం హోం… ప్ర‌ధానంగా ఐటీ ఉద్యోగుల‌కే…అది కూడా ఆఫీసుకు రాలేని వేళ‌ల్లో క‌ల్పించే అవ‌కాశం. క‌రోనా వ‌ల్ల విధించిన లాక్ డౌన్ పుణ్యమా అని టెక్కీలంద‌రినీ కంపెనీలు వ‌ర్క్ ఫ్రం హోం ద్వారా ప‌నులు చేయించుకున్నాయి.

లాక్ డౌన్ స‌డ‌లింపుల తర్వాత కూడా ఇప్ప‌టికీ కొన్ని కంపెనీలు వ‌ర్క్ ఫ్రం హోం కొన‌సాగిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు ప‌లు ర‌కాల స‌మ‌స్య‌లు ఎదుర్కుంటుండ‌గా…కొన్ని రంగాలు సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కుంటున్న‌ట్లు తెలుస్తోంది. కంపెనీలన్నీ వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తుండటం, కాలేజీలు తెరుచుకోకపోవడంతో చిరు వ్యాపారులు, క్యాబ్ డ్రైవర్లు, హాస్టల్ నిర్వాహకులు, హౌస్ కీపింగ్, క్యాంటీన్ వర్కర్ల‌కు ఉపాధి కరువైంది.

ఐటీ ఎదుగుల‌లో త‌న స‌త్తా చాటుకుంటున్న హైద‌రాబాద్ ఐటీ కారిడార్ కేంద్రంగా దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు వివిధ కంపెనీల్లో వర్క్ చేస్తున్నారు. ఈ ప‌రిశ్ర‌మ‌పై ల‌క్ష‌లాది మంది ఆధార‌ప‌డి ఉన్నారు. వివిధ తినుబండారాలు, హోట‌ల్లు, రెస్టారెంట్లు, చిరు వ్యాపారులు, క్యాబ్ డ్రైవర్లు, హాస్టల్ నిర్వాహకులు, హౌస్ కీపింగ్, క్యాంటీన్ల నిర్వాహ‌కులు ఇలా….అనేక రంగాలు ఆధార‌ప‌డి ఉన్నాయి.

కరోనా కారణంగా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాల్లో బిజినెస్ పూర్తిగా పడిపోయింది. రోడ్డుకు ఇరువైపులా ఉండే స్ట్రీట్ ఫుడ్ వెహికల్స్ ఇప్పుడు కనిపించడం లేదు. మార్నింగ్ టిఫిన్ నుంచి లేట్ నైట్ బిర్యానీ వరకూ ఘుమఘుమలాడించే ఫుడ్ కోర్టులు తెరుచుకోలేదు.

లాక్ డౌన్ మొదలుకొని ఇప్పటికీ కంపెనీలు 90 శాతం వర్క్ ఫ్రం హోం ఫాలో అవుతున్నాయి.హైద‌రాబాద్ ఐటీ కారిడార్‌లో ఒక్కో కంపెనీ కనీసం 40 మంది ఎంప్లాయీస్ కు ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీ కల్పిస్తుంది. అందుకోసం 11,980 క్యాబ్లు నడుస్తున్నాయి. వ‌ర్క్ ఫ్రం హోం అమ‌లు వ‌ల్ల క్యాబ్‌లకు పని లేకుండా పోయింది.

ఇక సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఓపెన్ అవకపోవడంతో ఫుడ్ కోర్టుల కిరాయిలు, కరెంట్ బిల్లులు, హెల్పర్స్ జీత భత్యాలు రోజురోజుకూ భారమవుతున్నాయని స‌ద‌రు సంస్థ‌ల య‌జ‌మానులు వాపోతున్నారు. ఐటీ కారిడార్ ఉద్యోగుల‌పై ఆధార‌ప‌డి న‌డిపించే 3వేలకు పైగా ప్రైవేట్ హాస్టళ్లు మూతపడే ఉన్నాయి. మొత్తంగా ఇటు క‌రోనా అటు వ‌ర్క్ ఫ్రం హోం త‌మ‌ను దారుణంగా దెబ్బ‌తీస్తోంద‌ని ఆయా వ‌ర్గాలు వాపోతున్నాయి.