స్మితకు హైకోర్టు షాక్

ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు తెలంగాణా హైకోర్టు పెద్ద షాకిచ్చింది. తనపై ఒక మ్యాగజైన్ లో వచ్చిన ఒక స్టోరీపై ఆమె 2015లో పరువు నష్టం దావా వేశారు. సదరు మ్యాగజైన్ పై రు. 10 కోట్లకు పరువు నష్టం దావాను వేసిన స్మిత అందుకు అయ్యే కోర్టు ఖర్చులను ప్రభుత్వం నుంచి తీసుకున్నారు. ఆమె ప్రభుత్వానికి రిక్వెస్టు చేసుకోగానే వెంటనే ప్రభుత్వం కూడా రు. 15 లక్షలు మంజూరు చేసేసింది. దీన్నే ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఇద్దరు తప్పుపట్టారు.

స్మిత ఆమె భర్త సబర్వాల్ హాజరైన ఒక ప్రైవేటు ప్రోగ్రామ్ పై సదరు మ్యాగజైన్ కథనం ఇచ్చింది. ఆ కథనంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆమె వెంటనే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు విచారణ సందర్భంగానే కోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. స్మిత తన భర్తతో హాజరైంది ఒక ప్రైవేటు ప్రోగ్రామ్ అని నిర్ధారించింది. ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన స్మిత దంపతులపై వచ్చిన కథనాన్ని ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైనట్లు స్మిత ఎలా భావించారో చెప్పాలన్నది.

ఆమె హాజరైన ప్రైవేటు కార్యక్రమానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేనపుడు ఆమె కోర్టు ఖర్చులను ప్రభుత్వం ఎందుకు భరించాలని ఇటు స్మితతో పాటు అటు ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రభుత్వం నుంచి అందుకున్న మొత్తాన్ని వెంటనే ఆ ఐఏఎస్ అధికారి ప్రభుత్వానికి జమ చేసేయాలని ఆదేశించింది.

స్మిత హాజరైన ఫ్యాషన్ షో ఏమన్నా ప్రభుత్వ అధికారిక కార్యక్రమమా అని కోర్టు అడిగిన ప్రశ్నకు స్మిత సమాధానం ఇవ్వలేకపోయారు. వ్యక్తిగత హోదాలో హాజరైన కార్యక్రమాలకు ప్రభుత్వ విధులకు ఎలా లింక్ పెడతారన్న ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదు. దాంతో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయద్దని హెచ్చరించి తీసుకున్న మొత్తాన్ని వెంటనే చెల్లించాలని తీర్పుచెప్పింది. ప్రైవేటు వ్యక్తి కేసులో ప్రభుత్వ నిధులను ఖర్చు చేసేందుకు లేదని హైకోర్టు గట్టిగానే చెప్పింది. తీసుకున్న రూ. 15 లక్షలను 90 రోజుల్లో తిరిగి చెల్లించేయాలంటు స్పష్టంగా చెప్పింది.