బాయ్‌కాట్ చైనా.. చేదు వాస్తవాలు

కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాపై ఇప్పటికే భారతీయులంతా తీవ్ర ఆగ్రహంతో ఉండగా.. సరిహద్దుల్లో ఆ దేశ అకృత్యాలతో మరింతగా మన వాళ్ల గుండె రగిలిపోతోంది. దీంతో ‘బాయ్‌కాట్ చైనా’ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. చైనాలో తయారైన టీవీని తీసుకొచ్చి ఓ అపార్ట్‌మెంట్ పై నుంచి కిందికి విసరడం.. దాన్ని అందరూ కలిసి పగలగొట్టి తొక్కడం.. ఇలాంటి వీడియోలెన్నో వైరల్ అవుతున్నాయి.

కొందరేమో చైనా యాప్స్ అన్నింటినీ ఫోన్ల నుంచి డెలీట్ చేసేస్తున్నారు. ఇంకొందరు వేరే రకంగా చైనాపై తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. కానీ చైనాను బహిష్కరించడం అంత తేలికైతే కాదన్నది నిపుణుల మాట.

ఎందుకంటే మన జన జీవనంలో అనేక రకాలుగా చైనా పాత్ర ఉంటోంది. ‘చైనా’ను అవాయిడ్ చేసి మనం ఒక్క రోజు కూడా బతకలేని పరిస్థితి. ఇదే విషయమై మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ యూట్యూబ్‌లో ఒక విశ్లేషణ చేశారు.

ఇప్పుడు చైనాతో కయ్యం పెట్టుకున్న మోడీ సర్కారు.. దేశంలోకి చైనా పెట్టుబడులు వరదలా రావడానికి కొన్నేళ్ల కిందటే గేట్లు తెరిచిందని.. 2014లో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఇండియాలో చైనా సంస్థల పెట్టుబడులు 500 శాతం పెరిగాయని ఆయన వెల్లడించారు. తద్వారా ఇండియాలో ఇప్పుడు ఏ వ్యక్తీ ‘చైనా’ కనెక్షన్ లేకుండా బతకలేని పరిస్థితి వచ్చిందని ఆయనన్నారు.

సోషల్ మీడియాలో విపరీతమైన దేశభక్తితో చైనాకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వాళ్లందరూ మొన్న వన్ ప్లస్ 8 ప్రొ మొబైల్ లాంచ్ చేస్తే ఒక్క నిమిషంలో ఆ ఫోన్లన్నీ కొనేశారని.. అది చైనా సంస్థ అనే విషయం వాళ్లకు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. ‘వన్ ప్లస్’ వద్దు.. కొంచెం ఎక్కువ డబ్బులైనప్పటికీ అమెరికా కంపెనీ అయిన ఐఫోన్ కొందామనేవాళ్లు ఉన్నారని.. కానీ ఆ ఫోన్లలో 80 శాతం చైనాలోనే తయారవుతాయని ఆయన చెప్పారు.

ఇంట్లో ఉపయోగించే మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్, వాషింగ్ మెషీ, ఫ్రిడ్జ్.. ఇలా ఎన్నో వస్తువులు చైనా కంపెనీలకు చెందినవే అని.. లేకుంటే చైనా నుంచి వచ్చే ముడిసరుకుతో అయినా తయారవుతాయని నాగేశ్వర్ తెలిపారు. ఇప్పుడు చాలామంది కరెన్సీ నోట్లను పక్కన పెట్టి ‘పేటీఎం’కు అలవాటు పడ్డారని.. డీమానిటైజేషన్ టైంలో ప్రభుత్వమే పేటీఎంను ప్రోత్సహించిందని.. కానీ ఆ సంస్థలో చైనా పెట్టుబడులు ఉన్న సంగతి చాలామందికి తెలియదని అన్నారు నాగేశ్వర్.

ఇక బయటికెళ్లడానికి ఓలా కార్ బుక్ చేయాలంటే అందులో చైనా పెట్టుబడులున్నాయని.. రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకుందాం అంటే జొమాటో, స్విగ్గీల్లో చైనా పెట్టుబడులున్నాయని.. ఇవన్నీ పక్కనపెడితే జబ్బు చేస్తే ఏదైనా మందు వేసుకుందాం అంటే.. ఇండియాలో తయారయ్యే 70 శాతం మందులకు ముడిసరుకు చైనా నుంచే వస్తుందని.. ఇంతగా మన జీవనాల్లోకి వచ్చేసిన చైనాను బహిష్కరించాలనుకోవడం తెలివి తక్కువతనమే అవుతుందని ఆయన తేల్చేశారు.