మ‌హిళా పోలీసుల యూనిఫాం.. ఇలా షాకిచ్చారేంటి?

నెల్లూరు పోలీసు విభాగంలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. నెల్లూరు మహిళా పోలీసుల యూనిఫామ్ సైజులని పురుష ద‌ర్జీ తీసుకుంటున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. మహిళల డ్రెస్ సైజులు పురుషులు తీయడమే జగన్ రెడ్డి చేసే రివర్స్ పరిపాలన అంటూ తెలుగుదేశం పార్టీ ఓ రేంజ్‌లో విరుచుకుప‌డింది. మహిళల పట్ల వైసీపీ ప్ర‌భుత్వం చేస్తున్న ఈ ఘోరాన్ని అందరూ ఖండించండి అంటూ సోష‌ల్ మీడియాలో హోరెత్తించారు. ఈ విష‌యంలో సోష‌ల్ మీడియా కేంద్రంగా వ‌చ్చిన స్పంద‌న‌లు, అనంత‌రం పోలీసులు స్పందించిన తీరు వార్త‌ల్లోకి ఎక్కింది.

మ‌హిళా పోలీసుల విష‌యంలో జ‌రిగిన ఉదంతంపై ప‌లువురు ఘాటుగా స్పందించారు. మహిళ మంత్రిగా ఉన్న శాఖలో ఇలాంటివి జరగడం బాధాకరమ‌ని పలువురు పేర్కొన్నారు. మ‌రికొంద‌రు స‌హ‌జంగానే సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం విమ‌ర్శ‌లు చేశారు. ఇక ఈ వార్త‌లు వైర‌ల్ అయిన నేప‌థ్యంలో నెల్లూరు పోలీసులు స్పందించారు. `యూనిఫాం కొల‌త‌లు తీసుకునే ఇంచార్జ్ గా ఉన్న హెడ్ కానిస్టేబుల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం` అని జిల్లా ఎస్‌పీ ప్ర‌క‌టించారు. దీంతోపాటుగా త‌క్ష‌ణమే చేసిన మార్పుల‌ను సైతం ట్వీట్లో వెల్ల‌డించారు. “యస్.పి. గారి సమక్షంలో అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారి ఆధ్వర్యంలో ఉమెన్ SI, ఉమెన్ టైలర్స్, స్టాఫ్ ద్వారా తీసుకుంటున్న మహిళా పోలీసుల క్లాత్స్ మెజర్ మెంట్స్.` అని నూత‌న ఫోటోల‌ను జ‌త చేశారు.

ఈ ఉదంతం వెలుగులోకి వ‌చ్చిన‌ వెంటనే జిల్లా ఎస్‌పీ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించి,అడిషనల్ యస్.పి.(అడ్మిన్)  ఆధ్వర్యంలో జరిగేలా మహిళా టైలర్స్ నే నియమించాలని ఆదేశాలు  వెలువ‌రించార‌ని నెల్లూరు పోలీసులు తెలియ‌జేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా పోలీసుల మెజర్‌మెంట్స్ ను ఎవరికీ అసౌకర్యం కలగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. మహిళల రక్షణ, వారి గౌరవం పెంచడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమ‌ని వివ‌రించారు.  ఎటువంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని కోరారు.

అయితే, ఈ న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల‌తో పాటుగా నిబంధ‌న‌ల ప్ర‌కారం సైతం పోలీసులు ముందుకు వెళ్లారు. “ అనుమతిలేని ప్రదేశంలోకి ప్రవేశించి ఫోటోలు తీసిన గుర్తు తెలియని వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలకు ఆదేశాలు వెలువ‌రించాం“ అని నెల్లూరు పోలీసులు తెలిపారు. అయితే, దీనిపై నెటిజ‌న్లు భ‌గ్గుమ‌న్నారు. బాధాక‌ర‌మైన ఘ‌ట‌న‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చిన వ్యక్తిపై చ‌ర్య‌లు ఏంట‌ని ప్ర‌శ్నించారు. కాగా, ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసేలా మారిపోయిన ఈ ఘ‌ట‌న‌పై ప‌లువురు అధికారిక‌ ముఖ్యులు వివ‌రాలు ఆరాతీసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.