బజాజ్ ప్రియ స్కూటర్ మీద వెళ్లే ఆయనింట్లో రూ.257 కోట్ల క్యాష్

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సుగంధాల వ్యాపారం చేసే పీయూష్ జైన్ ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.257 కోట్ల బ్లాక్ మనీ బయటకు రావటం తెలిసిందే. ఒకేచోట ఇంత భారీగా నల్లధనం బయటకు రావటం విస్తుపోయేలా చేసింది. అధికారులు నాలుగు రోజుల పాటు నాన్ స్టాప్ గా యంత్రాల సాయంతో నోట్ల కట్టల్ని లెక్క కట్టిన పరిస్థితి. నోట్ల లెక్కింపునకే ఇంత సమయం పడితే.. ఆ ఇంట్లో లభించిన ఆస్తుల దస్తావేజులు.. బంగారు ఆభరణాలతో పాటు.. ఇతర పత్రాల్ని లెక్క చేయటానికి మరెంత టైం పడుతుందో తెలీని పరిస్థితి.

ఇంత భారీగా నగదు లభించిన ఇంటి యజమానికి సంబంధించిన వాహనాల్ని చూస్తే నోట మాట రాదంతే. ఎందుకంటే.. పీయూష్ జైన్ ఇంటి ముందు ఇప్పటికి పాత క్వాలీస్.. మారుతి కార్లు ఉంటాయి. అన్నింటి కంటే మరింత ఆశ్చర్యానికి గురి చేసే అంశం.. ఆయన తన పూర్వీకుల ఊరు కన్నౌజ్ కు ఎప్పుడు వెళ్లినా.. దశాబ్దాల క్రితం నాటి బజాజ్ ప్రియ స్కూటర్ తీసుకొని వెళ్లటం.. దాని మీదనే తిరగటం చేస్తుంటారు. అలాంటి ఆయన ఇంట్లో రూ.257 కోట్ల క్యాష్ లభించటం స్థానికుల్ని సైతం షాక్ కు గురయ్యేలా చేస్తోంది.

అంతేకాదు.. రూ.250 కేజీల వెండి.. 25 కేజీల బంగారంతో పాటు.. విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా లభించాయి. వీటితో పాటు 600 కేజీల గంధపు చెక్కల నూనెను సైతం స్వాధీనం చేసుకున్నారు. గడిచిన 20 ఏళ్లుగా సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసే పీయూష్ జైన్.. యూపీతో పాటు ముంబయి.. గుజరాత్ లలో కూడా ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి కోట్లల్లో ఆదాయం వస్తున్నా.. ఆయన జీవనం మాత్రం సాదాసీదాగా ఉండటం గమనార్హం.

ఇంతకీ ఇంతటి భారీ స్కాం ఎలా బయటకు వచ్చిందన్నది చూస్తే.. చిన్నపాటి కక్కుర్తేనని తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం కాన్పూరులో జీఎస్టీ చెల్లించకుండా సరఫరాచేస్తున్నా.. నాలుగు ట్రక్కుల్ని అధికారులు పట్టుకున్నారు. వాటిల్లో పొగాకు.. పాన్ మసాలా ఉత్పత్తులు ఉన్నట్లుగా గుర్తించారు. గణపతి రోడ్ క్యారియర్ కు చెందిన ఈ ట్రక్కుల్లో ఉన్న సరుకు ఆధారంగా శిఖర్ పాన్ మసాలా ఫ్యాక్టరీకి వెళ్లారు.

అక్కడే గణపతి రోడ్ క్యారియర్ పేరుతో దాదాపు 200లకు పైగా నకిలీ ఇన్ వాయిస్ ల్ని అధికారులు గర్తించారు. దీంతో.. ఈ కంపెనీ వ్యవహారం మీద ఫోకస్ చేసిన అధికారులు.. యాజమాన్యాన్ని విచారించగా.. పన్ను చెల్లించలేదని పేర్కొంటూ.. అప్పటికప్పుడు రూ.3.09 కోట్లను డిపాజిట్ చేశారు. ఇదే సమయంలో శిఖర్ పాన్ మసాలాలో ఒడోకామ్ ఇండస్ట్రీస్ కు వాటాలు ఉన్నట్లుగా సమాచారం రావటం.. అప్పుడే పీయూష్ జైన్ పేరు బయటకు వచ్చింది. దీంతో.. అతడి ఇంటికి వెళ్లి..తనిఖీలు చేపట్టగా.. నీట్ గా ప్యాక్ చేసిన నోట్ల కట్టలు.. భారీగా బయటకు రావటం అధికారులకు దిమ్మ తిరిగేలా చేసింది. అలా.. మొదలైన సోదాల పర్వం.. చివరకు రూ.257 కోట్ల క్యాష్.. కోట్లాది రూపాయిల ఆస్తులు బయటకు వచ్చాయి.