తెలుగు జర్నలిస్టు మృతి.. విషాదకర కోణం

కోవిడ్-19 అన్ని రంగాల వాళ్లనూ కబలిస్తోంది. సామాన్య జనంతో పాటు సినిమా వాళ్లు, వైద్యులు, పోలీసులు అందరూ దీని బారిన పడ్డారు. ఆయా రంగాల వాళ్లు ప్రాణాలూ కోల్పోయారు. కరోనాకు ఎదురెళ్లి విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులు సైతం పెద్ద ఎత్తునే కరోనా బారిన పడ్డారు. కొందరు మృత్యువాత పడ్డారు.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తాజాగా మనోజ్ కుమార్ అనే టీవీ5 జర్నలిస్టు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అతను ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. మిస్తీనియా గ్రేవిస్ అనే వ్యాధి కారణంగా అతడికి ఇటీవలే ఓ సర్జరీ కూడా జరిగింది.

అయినప్పటికీ అతను కరోనా వేళ విధులు కొనసాగించాడు. లాక్ డౌన్ కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభం మీడియాను గట్టి దెబ్బ కొట్టింది. జర్నలిస్టులకు జీతాల చెల్లింపు సరిగా లేదు. వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే మనోజ్.. అనారోగ్యంతోనూ విధుల్లో కొనసాగినట్లున్నాడు.

యుక్త వయసులో ఉన్న వాళ్లకు కరోనా సోకినా ఏమంత ప్రమాదం లేదంటున్నారు కానీ.. వేరే అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్లు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్లపై అది తీవ్ర ప్రభావం చూపుతోంది. మనోజ్‌కు ఈ పరిస్థితుల్లోనే ఆరోగ్యం విషమించింది. ప్రాణాలు కోల్పోయాడు. అతడి కుటుంబ పరిస్థితి గురించి బయటికొచ్చిన సమాచారం మనోజ్ ఎవరో తెలియని వాళ్లను కూడా కంట తడి పెట్టిస్తోంది.

కొన్నేళ్ల కిందటే మనోజ్ అన్న, వదినలు రోడ్డు ప్రమాదంలో చనిపోయారట. వాళ్లకు ఓ కొడుకు ఉంటే.. అతణ్ని మనోజే చూసుకుంటున్నాడు. ఎనిమిది నెలల కిందటే మనోజ్‌కు పెళ్లయింది. అన్న కొడుకును చూసుకోవడం కోసం తనకు పిల్లలు వద్దని అతను నిర్ణయించుకున్నాడట.

ఇంత త్యాగం చేసి అన్న కొడుకును చూసుకుంటున్న అతను.. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు అతడి భార్య, ఆ పిల్లాడి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కొన్నేళ్ల వ్యవధిలో ఇద్దరు బిడ్డల్ని కోల్పోయిన తల్లి వేదన ఎలాంటిదో చెప్పేదేముంది?