మాల్యాకు జనవరి 18న సుప్రీంకోర్టులో శిక్ష ఖరారు

వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన కేసుల విచారణను ఎదుర్కొంటున్న విజయమాల్యకు చివరకు కోర్టు ధిక్కార కేసులో సుప్రీంకోర్టు శిక్షను విధించబోతోంది. కోర్టు ధిక్కారం విషయంలో మాల్యాకు విధించబోయే శిక్షను 2022, జనవరి 18వ తేదీన ప్రకటిస్తామని సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది. అసలు కన్నా కొసరే ఎక్కువ అన్నట్లు వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన కేసులు అనేకం మాల్యాపై కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి. ఆ కేసుల్లో కాకుండా కోర్టు ధిక్కారం విషయంలో మాల్యాకు శిక్ష పడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.

యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) సీఈవోగా, కింగ్ ఫిషన్ ఎయిర్ లైన్స్ సీఈవోగా విజయ మాల్యా అంతర్జాతీయంగా ఎంత పేరు సంపాదించుకున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. యూబీ అంటే మద్యం ఉత్పత్తి చేసే కంపెనీ. యూబీలో అనేక రకాల మద్యాలున్నప్పటికీ కింగ్ ఫిషర్ బీరంటే యావత్ ప్రపంచానికి బాగా పరిచయం. దశాబ్దాల పాటు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపిన మాల్యా విమానయాన రంగంలోకి దిగి కింగ్ ఫిషర్  ఎయిర్ లైన్స్ ను ప్రారంభించటంలో ఆయన అదృష్టం తిరగబడింది.

ఎయిర్ లైన్స్ బిజినెస్ కోసం వివిధ బ్యాంకుల నుండి మాల్యా వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. అయితే ఎంత కాలానికి అప్పు తీర్చకపోవటమే కాకుండా చివరకు వడ్డీని కూడా కట్టకుండానే దేశం వదిలి  బ్రిటన్ పారిపోయారు. అంటే బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగొట్టి దేశం విడిచి పారిపోయారు. దాంతో అప్పిచ్చిన బ్యాంకులన్నీ ఎస్బీఐ ఆధ్వర్యంలో కన్సార్షియం గా ఏర్పడి మాల్యాపై కోర్టులో కేసులు వేశాయి. సరే ఈ కేసు నడుస్తుండగానే మాల్యాపై కోర్టు ధిక్కారం కేసు పడింది.

ఇంతకీ కోర్టు ధిక్కారం ఏమిటంటే కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదిలీ చేశారు. దాదాపు రు. 9 వేల కోట్లు ఎగ్గొట్టిన కేసు తేలేవరకు మాల్యా బ్యాంకు ఖాతాలన్నీ ఫ్రీజింగ్ లోనే ఉండాలి. అలాంటిది తన ఖాతా నుండి పిల్లల ఖాతాలకు 40 మిలియన్ డాలర్లను ఎలా బదిలీ చేశారో అర్థం కావటంలేదు. ఇదే విషయమై సుప్రికోర్టు విచారణలో తేలటంతో మాల్యాపై కోర్టు ధిక్కారం రుజువైంది.

అన్నింటికన్నా విచిత్రం ఏమిటంటే మాల్యాను మన దేశానికి అప్పగించాలని బ్రిటన్ అత్యున్నత కోర్టు ఆదేశించినా ఇంతవరకు ఆ ఆదేశాలు అమల్లోకి రాకపోవటం. అంటే మనదేశంలోనే కాదు విదేశాల్లో కూడా మాల్యా వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. భారత్ కు రాకుండా ఎలాగైనా బ్రిటన్లోనే ఉండిపోవాలని మాల్యా చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. దీనికి తెరవెనుక చాలామంది అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు పూర్తిగా సహకరిస్తున్నారు. మరి సుప్రిం కోర్టు కోర్టు ధిక్కారం శిక్షను విధించినా  ఎలా అమలవుతుందనే అనుమానం పెరిగిపోతోంది.