ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్.. తెలుగు మీమ్స్ మోత

ప్రపంచ క్రికెట్లో గత కొన్నేళ్లలో చాలా వేగంగా ఎదిగిన జట్టు ఆఫ్ఘనిస్థాన్. తమ దేశంలో క్రికెట్ సౌకర్యాలు అంతంతమాత్రం అయినా.. ఇంకా ఎన్నో రకాల ఇబ్బందులన్నా.. వాటన్నింటినీ అధిగమించి గొప్ప ప్రదర్శన చేస్తూ.. స్ఫూర్తిదాయక పోరాటాలతో.. పెద్ద జట్లపై విజయాలతో అందరి మనసులూ దోచింది ఆఫ్ఘనిస్థాన్. ఆ జట్టుకు చెందిన రషీద్ ఖాన్ ఐపీఎల్‌లో అదరగొడుతూ మన అభిమానులకు ఎంతో చేరువయ్యాడు.

ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ల ప్రవర్తన కూడా మన వాళ్లను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. దీనికి తోడు సొంతగడ్డపై అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేని స్థితిలో భారత్‌నే తమ సొంతగడ్డగా మార్చుకుని ఇక్కడే తమ హోం సిరీస్‌లు ఆడారు ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లు. ఆ దేశంలో బీసీసీఐ తమ డబ్బులతో స్టేడియాలు కడుతుండటం విశేషం. పరోక్షంగా ఇంతగా భారత్ మద్దతు అందుకుంటున్న ఆఫ్ఘనిస్థాన్.. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇండియా నుంచి అనూహ్యమైన సపోర్ట్ తీసుకుంటోంది.

ఇందుక్కారణం ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ చేరే అవకాశాలు ఆఫ్ఘనిస్థాన్ చేతుల్లోనే ఉండటమే. ఆదివారం ఆ జట్టు న్యూజిలాండ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్.. కివీస్ మీద స్వల్ప తేడాతో గెలిస్తే.. ఆ తర్వాత సోమవారం నమీబియాపై ఇండియా గెలిస్తే మన జట్టు సెమీస్ చేరుతుంది. స్కాట్లాండ్ మీద భారీ తేడాతో గెలవడం ద్వారా గ్రూప్‌లో నెట్ రన్ రేట్ పరంగా అన్ని జట్లకూ ఇండియా దాటేసింది. కాబట్టి అఫ్ఘాన్.. కివీస్‌‌ను ఓడిస్తే చాలు ఇండియా సెమీస్ చేరినట్లే.

ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి ఇండియన్స్ మీమ్స్ మోత మోగించేస్తున్నారు. ముఖ్యంగా మీమ్స్ చేయడంలో తెలుగు నేెటిజన్ల ప్రతిభ గురించి చెప్పేదేముంది? తెలుగు సినిమాల్లో అనేక సన్నివేశాలను తీసుకుని.. ఫన్నీ మీమ్స్ తయారు చేస్తున్నారు. బ్రహ్మి చేసిన డిఫరెంట్ ఫన్నీ క్యారెక్టర్లతో తయారు చేసిన మీమ్స్ భలే ఫన్నీగా ఉన్నాయి. ఐతే ఈ వినోదాన్ని రెట్టింపు చేస్తూ.. ఇండియా ఆశల్ని నిలబెడుతూ ఆఫ్ఘనిస్థాన్.. కివీస్‌ను ఓడిస్తుందేమో చూడాలి.