ముంబయి ఇండియన్స్ కథ ముగిసినట్లే

గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శనతో వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచి ఔరా అనిపించింది ముంబయి ఇండియన్స్‌. మొత్తంగా ఐపీఎల్‌లో ఐదుసార్లు టైటిల్ సాధించి తనకు తానే సాటి అనిపించిందా జట్టు. అంతకుముందు వరకు ఒక సీజన్ విడిచిపెట్టి ఒక సీజన్ టైటిల్ గెలుస్తూ వచ్చిన ముంబయి.. గత సీజన్లో మాత్రం ట్రెండు మార్చింది. వరుసగా రెండో పర్యాయం కూడా విజేతగా నిలిచింది. ఇదే ఊపులో హ్యాట్రిక్ టైటిల్ సాధించి చరిత్ర సృష్టిస్తుందని.. ఆ జట్టుకు ఎదురుండదని అనుకున్నారు అభిమానులు.

ఐపీఎల్ 14వ సీజన్ ప్రథమార్ధంలో ఆ జట్టు తడబడ్డప్పటికీ.. ఇలా ఆరంభంలో ఇబ్బంది పడి ఆ తర్వాత పుంజుకుని ప్లేఆఫ్స్ చేరడం, టైటిల్ ఎగరేసుకుపోవడం ఆ జట్టుకు కొత్తేమీ కాదు కాబట్టి.. మరోసారి అదే కథ పునరావృతం అవుతుందనుకున్నారు. కానీ ఆ అంచనాలు తలకిందులైనట్లే కనిపిస్తున్నాయి.

13 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలు మాత్రమే సాధించిన ముంబయి.. చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌గా కొంచెం గట్టిగా గెలిచి ప్లేఆఫ్స్ బెర్తు సాధించాలనుకుంది. ఈ లోపు కోల్‌కతా.. రాజస్థాన్ చేతిలో ఓడిపోవాలని ఆశించింది. ఒకవేళ గెలిచినా.. స్వల్ప తేడాలతో గెలవాలనుకుంది. కానీ ఆ జట్టు ఆశలు, అంచనాలకు భిన్నంగా.. రాజస్థాన్‌పై గురువారం భారీ విజయం సాధించింది నైట్‌రైడర్స్. మొదట 4 వికెట్లకు 171 పరుగులు చేసిన కోల్‌కతా.. తర్వాత రాయల్స్‌ను కేవలం 85 పరుగులకే కుప్పకూల్చి 86 పరుగుల తేడా ఘనవిజయాన్నందుకుంది. దీంతో ఇప్పటికే మెరుగ్గా ఉన్న నెట్ రన్‌రేట్ ఇంకా పెరిగి +0.587కు చేరుకుంది. ముంబయి నెట్ రన్‌రేటేమో -0.048గా ఉంది.

శుక్రవారం సన్‌రైజర్స్‌పై ముంబయి ఎంత భారీగా గెలిచినా ఈ రన్‌రేట్‌ను దాటి, కోల్‌కతాను వెనక్కి నెట్టడం, ప్లేఆఫ్స్ చేరడం కష్టమే. కాబట్టి నైట్‌రైడర్స్ దాదాపు ముందంజ వేసినట్లే. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి కథ ముగిసినట్లే. ఇక ఆల్రెడీ ప్లేఆఫ్స్‌కు దాదాపు దూరమైనప్పటికీ సాంకేతికంగా పోటీలో ఉన్న పంజాబ్, రాజస్థాన్.. కోల‌్‌కతా విజయంతో అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇక ముంబయి కథే తేలాల్సి ఉంది.