బిల్ గేట్స్ కే బురిడీ.. రూ.700 కోట్లకు పైనే మోసగించిన పాకిస్థానీ

తిరుగులేని వ్యాపారవేత్తగా.. దాన గుణంలోనూ అందరి చేత మన్ననలు పొందే అపర కుబేరుడు బిల్ గేట్స్ ను పాకిస్థాన్ కు చెందిన ఒక వ్యాపార వేత్త అడ్డంగా మోసగించాడా? అంటే అవునని చెబుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. బిల్ గేట్స్ లాంటి వ్యాపార దిగ్గజాన్ని వందల కోట్ల మేర అంత సులువుగా ఎలా మోసం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా సైమన్ క్లార్క్.. విలో లోచ్ అనే ఇద్దరు రచయితలు తాము రాసిన పుస్తకంలో ఈ విషయాన్ని వివరంగా పేర్కొన్నారు.

వ్యాపారంతో పాటు దాన గుణం ఎక్కువగా ఉన్న బలహీనతను అసరాగా చేసుకొని పాక్ వ్యాపారి ఆరిఫ్ నఖ్వీ మోసపుచ్చినట్లుగా చెబుతున్నారు. వారి అంచనా ప్రకారం దాదాపు రూ.743 కోట్ల మేర మోసం చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంతకీ వారు రాసిన పుస్తకం ( ది కీ మ్యాన్: ది ట్రూ స్టోరీ ఆఫ్ హౌ ది గ్లోబల్ ఎలైట్ వాజ్ డూప్డ్ బై ఎ క్యాపిటలిస్ట్ ఫెయిరీ టేల్)లో పేర్కొన్నారు. ఒక్క గేట్స్ మాత్రమే కాదు.. చాలామంది ప్రముఖులు అతడి బుట్టలో పడ్డారని చెబుతారు.

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్న నఖ్వీ వ్యాపారవేత్తగా మారారు. అబ్రాజ్ గ్రూప్ కంపెనీని స్టార్ట్ చేశాడు. 118 మిలియన్ డాలర్లతో ఏర్పాటు చేసిన కంపెనీతో పాటు.. తాను పేదరికాన్ని రూపుమాపే ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాదు.. 2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా నిర్వహించిన సమావేశానికి హాజరైన 250 మంది ముస్లిం వ్యాపారవేత్తల్లో నఖ్వీ ఒకరు.

ప్రపంచాన్ని ప్రభావితం చేసే పెట్టుబడులు.. శిక్షణ.. ఉపాధి కల్పన అంశాలపై మాట్లాడిన అతడి దెబ్బకు అమెరికా సైతం అతని సంస్థల్లో 150 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టటం గమనార్హం. పలు వర్సిటీలకు కోట్ల రూపాయిల విరాళాలు ఇచ్చిన అతను.. గేట్స్ ఫౌండేషన్ మాదిరే అమన్ ఫౌండేషన్ ను స్థాపించారు. 2017లో బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేయటం కోసం న్యూయార్కులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని.. పారిశ్రామికవేత్తలు హాజరు కావాలని కోరారు. ప్రపంచంలోని సంపన్నులు.. బలమైన నేతల్ని కలిశాడు. అందులో బిల్ గేట్స్.. క్లింటన్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు. నఖ్వీ చురుకుదనం నచ్చటంతో గేట్స్ తన ఫౌండేషన్ నుంచి 100 మిలియన్ డాలర్లను అందించారు. పాక్ లో జనాభా నియంత్రణకు తాను ప్రయత్నిస్తానని చెప్పటంతో ఈ భారీ మొత్తాన్ని నఖ్వీకి ఇచ్చారు.

అయితే.. నిధుల్ని దుర్వినియోగం చేస్తున్న వైనంపై అతడి కంపెనీలో పని చేసే ఉద్యోగి ఒకరు ఈ మొయిల్ రూపంలో అతని పెట్టుబడిదారులకు పంపటంతో అతడి బండారం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో 2019 ఏప్రిల్ 10న హీత్రో ఎయిర్ పోర్టులో అతన్ని అరెస్టుచేశారు. అతడి మీద ఉన్న నేరారోపణలు రుజువైతే ఏకంగా 291 సంవత్సరాలు జైలుశిక్ష పడుతుందని చెబుతున్నారు. గేట్స్ నే బురిడీ కొట్టించిన వైనం తాజా పుస్తకంలో వివరంగా పేర్కొనటం సంచలనంగా మారింది.