లవ్లీనాకు అస్సాం సీఎం బంపర్ ఆఫర్

ఇటీవ‌ల ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు, క్రీడాకారులు అదరగొట్టిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనూ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు రికార్డు స్థాయిలో పతకాలు సాధించి దేశకీర్తిని ఇనుమడింపజేశారు. దీంతో, కష్టపడి దేశం కోసం పతకాలు సాధించిన క్రీడాకారులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీ మొత్తంలో నగదు నజరానాలు, ప్రభుత్వ ఉద్యోగాలతో సన్మానించి సత్కరిస్తున్నాయి.

ఈ క్రమంలోనే మహిళల బాక్సింగ్ విభాగంలో తన పంచ్ లతో ప్రత్యర్థిని మట్టి కరిపించి కాంస్య పతకం సాధించిన అస్సాం మిస్సైల్ లవ్లీనాపై అస్సాం సీఎం హిమంత బిశ్వకర్మ వరాల జల్లు కురిపించారు. టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించి తమ రాష్ట్రానికి వన్నె తెచ్చిన లవ్లీనాకు భారీ నజరానా ప్రకటించారు. లవ్లీనాకు కోటి రూపాయ‌ల న‌గ‌దుతో పాటుగా, పోలీసు శాఖ‌లో డీఎస్పీ ఉద్యోగాన్ని బిశ్వకర్మ సర్కార్ ఆఫ‌ర్ చేశారు.

దీంతోపాటు, లవ్లీనా నివసిస్తున్న గ్రామంలో బాక్సింగ్ అకాడెమీ ఏర్పాటుతో పాటుగా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తామ‌ని బిశ్వ‌శ‌ర్మ హామీ ఇచ్చారు. ప్యారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లే వ‌ర‌కు ప్ర‌తి నెలా ల‌క్ష‌రూపాయ‌ల చొప్పున స్కాల‌ర్‌షిప్‌ను ల‌వ్లీనాకు అందిస్తామని కూడా బిశ్వకర్మ ప్ర‌క‌టించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించే విధంగా ప్ర‌ణాళిక‌లు చేప‌డుతున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇక, టోక్యో నుంచి అస్సాంకు నేడు చేరుకున్న‌ లవ్లీనాను ఎయిర్ పోర్టుకు వెళ్లి మరీ స్వయంగా బిశ్వకర్మ రిసీవ్ చేసుకోవడం విశేషం. ఎయిర్ పోర్టుకు వెళ్లి లవ్లీనాకు స్వాగతం పలికిన అస్సాం సీఎంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.