కొడుకు ప్రేమ పెళ్లి: కోడలిని రూ.80వేలకు అమ్మిన మామ

కొడుకు.. ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అది నచ్చని తండ్రి.. ఏకంగా కొడుకు లేని సమయంలో కోడలిని వేరొకరికి అమ్మేశాడు. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ కి చెందిన చంద్ర రామ్ కి కి కొడుకు అంటే పంచ ప్రాణాలు. కొడుక్కి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని అనుకున్నాడు. అయితే.. వీరికి చెప్పకుండా కొడుకు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. దీంతో… ఆ కోడలిని.. తన కొడుకు జీవితం నుంచి తప్పించాలని అనుకున్నాడు. అందుకోసం ఏకంగా మరో వ్యక్తికి కోడలిని అమ్మేశాడు.

పథకం ప్రకారం.. గుజరాత్‌కు చెందిన సహిల్‌ పాంచ అనే వ్యక్తి వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని బ్రోకర్ల ద్వారా చంద్రరామ్‌ తెలుసుకున్నాడు. దీంతో తన కోడలిని వాళ్లకు అమ్మాలని నిర్ణయించుకుని 80 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఈ క్రమంలో 40 వేలు అడ్వాన్స్‌గా తీసుకుని అందులో 20,000 తన కొడుకు బ్యాంకు ఖాతాకు పంపాడు. ఒక్కసారిగా అంత డబ్బు ఎలా వచ్చిందని ప్రిన్స్‌ తండ్రిని అడగగా, ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. ఆ తర్వాత తన ప్లాన్ అమలుపరిచాడు.

తన ఆరోగ్యం సరిగాలేదని తన బాగోగులు చూసుకోవడానికి కోడలిని కొన్ని రోజులు తన వద్దకు పంపమని కోరాడు. తండ్రి మాటలను నమ్మిన ప్రిన్స్‌ తన భార్యను జూన్‌ 4న బారాబంకిలో ఉంటున్న తండ్రి వద్దకు పంపాడు. జూన్‌ 5 సాయంత్రం చంద్ర రామ్‌ తనకి ఆరోగ్యం కుదుట పడిందని ఇంటికి వెళ్లమని కోడలికి తెలిపాడు.

అదే క్రమంలో తన స్నేహితుడు ఇంటి దగ్గర దింపుతాడని చెప్పి.. ముందుకు బేరం కుదుర్చుకున్న బ్రోకర్‌ వెంట కోడలిని పంపించాడు. అయితే భార్య ఎంతకు తన దగ్గరకు రాకపోవడంతంతో వూళ్లోని తన సమీప బంధువు ద్వారా తండ్రి మోసం తెలుసుకున్నాడు ప్రిన్స్. క్షణం కూడా ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి సాయంతో బాధితురాలితో కలిసి గుజరాత్‌కు వెళ్లేందుకు బారాబంకి రైల్వే స్టేషన్‌లో ఎదురుచూస్తోన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.