తమిళనాడు నుండి ఊహించని దెబ్బ

గోరుచుట్టు మీద రోకలిపోటు లాగ తయారైంది ఏపి పరిస్దితి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఏపిలోని కరోనా వైరస్ రోగులపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. అసలే అంబులెన్సులను నిలిపేస్తున్న తమిళనాడు ప్రభుత్వంతో వివాదం పెరిగిపోతోంది. ఇదే సమయంలో ఇలాంటి వివాదమే తమిళనాడు ప్రభుత్వంతో కూడా మొదలైంది. ఇంతకీ విషయం ఏమిటంటే తమిళనాడు నుండి ఏపిలోని ఆసుపత్రులకు అందుతున్న ఆక్సిజన్ సరఫరాను తగ్గించేసింది.

తమిళనాడులోని వివిధ ఫ్యాక్టరీల నుండి ఏపిలోని చిత్తూరు జిల్లా ఆసుపత్రులకు రోజు ఆక్సిజన్ అందుతోంది. తమిళనాడు నుండి పెద్దఎత్తున ఆక్సిజన్ అందుకుంటున్న ఆసుపత్రుల్లో రుయా, స్విమ్స్ ప్రధానమైనవి. ఎందుకంటే ఈ రెండు ఆసుపత్రులు వెయ్యి పడకలకు పైగా సామర్ధ్యంతో నడుస్తున్నాయి. వీటిలో అత్యధికం ఐసీయు, ఆక్సిజన్ సౌకర్యాలతో ఉండే బెడ్లే. ఒకవైపు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత పెరిగిపోతున్న నేపధ్యంలోనే ఆక్సిజన్ అవసరమైన రోగుల సంఖ్య బాగా పెరిగిపోతోంది.

ఒకవైపు రోగుల సంఖ్య పెరిగిపోతుంటే మరోవైపు ఆక్సిజన్ అవసరాలూ అంతేస్ధాయిలో పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలోనే ఆసుపత్రులకు అందించే ఆక్సిజన్ కోటాను తగ్గించేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా కంపెనీలను ఆదేశించింది. దాంతో తమిళనాడు నుండి ఆక్సిజన్ అందుకుంటున్న చిత్తూరు జిల్లాలోని ఆసుపత్రులకు సదరు ఆదేశాలను కంపెనీలు పంపాయి. దాంతో ఆసుపత్రుల ఉన్నతాధికారుల నెత్తిన ఒక్కసారి పిడుగుపడ్డట్లైంది.

స్విమ్స్ కు రోజుకు 18 కిలోలీటర్ల ఆక్సిజన్ అందుతోంది ఇపుడు. ఇకనుండి 8 కిలోలీటర్ల ఆక్సిజన్ మాత్రమే సరఫరా చేస్తామని కంపెనీ చెప్పేసింది. అలాగే రుయా ఆసుపత్రికి కూడా ఒప్పందం చేసుకన్న కోటాకన్నా తగ్గించేస్తున్నట్లు కంపెనీ సమాచారం ఇచ్చింది. ఆదేశాలను అందుకున్న ఆసుపత్రి అధికారులు వెంటనే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులకు చేరవేశారు.

ఇంతకీ తమిళనాడు ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏమిటంటే తమిళనాడులో కూడా కేసులు పెరిగిపోతుండటమే. తమిళనాడు వ్యాప్తంగా కరోనా రోగుల సంఖ్య పెరిగిపోవటంతో పాటు ఆక్సిజన్ అవసరాలు ఊహించినదానికన్నా పెరిగిపోతోందట. దాంతో తమ రోగులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరాను తగ్గించేయాలని స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించిది. ఇలాంటి నిర్ణయమే కేరళ కూడా తీసుకున్న విషయం తెలిసిందే.