ఐపీఎల్ మళ్లీ ఎప్పుడో గంగూలీ హింటిచ్చాడు

ఇండియన్ ప్రిిమియర్ లీగ్ 14వ సీజన్ అర్ధంతరంగా వాయిదా పడిపోయి అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. కరోనా కల్లోల సమయంలో అన్ని వినోదాలూ బంద్ అయిపోయిన నేపథ్యంలో ఐపీఎల్‌తోనే ఉపశమనం పొందుతున్న అభిమానులకు ఈ పరిణామం ఎంతమాత్రం రుచించలేదు. ముందు లీగ్ ఆపేస్తున్నట్లు వార్త బయటికి రాగానే.. కొన్ని రోజులు విరామం ఇచ్చి, ఆ తర్వాత మ్యాచ్‌లు జరిపిస్తారని అనుకున్నారు.

కానీ అలా కాకుండా లీగ్‌ను వాయిదా వేస్తున్నారని.. ఆటగాళ్లు సహా అందరూ ఎవరి స్వస్థలాలకు వాళ్లు వెళ్లిపోతున్నారని.. ఇప్పట్లో మ్యాచ్‌లు ఉండవని సమాచారం బయటికి రాగానే అభిమానులు మరింత నిరాశకు గురయ్యారు. ఇప్పుడిలా వాయిదా పడ్డ టోర్నీ మళ్లీ ఎప్పుడు జరుగుతుందో తెలియని అయోమయంలో ఉన్నారంతా. ఐతే మళ్లీ ఎప్పుడు లీగ్‌ను కొనసాగించే అవకాశముందో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ హింట్ ఇచ్చాడు.

ఈ ఏడాది చివర్లో భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్‌లో మిగతా మ్యాచ్‌లను నిర్వహించడానికి ప్రయత్నిస్తామని గంగూలీ వెల్లడించాడు. కానీ అప్పుడు మ్యాచ్‌లు నిర్వహించడం అనుకున్నంత తేలిక కాదు.టీ20 ప్రపంచకప్‌ అక్టోబరు మధ్యలో మొదలు కావాల్సి ఉంది. ఐతే సెప్టెంబరు 14 వరకు భారత జట్టు.. ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు ఆడాల్సి ఉంది. అంటే మధ్యలో నెల రోజుల ఖాళీ ఉంటుంది. కానీ ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమిచ్చినా, లేదా మరో చోట టోర్నీ జరిగినా కరోనా భయం ఉంటుంది కాబట్టి రెండు వారాల ముందే ఆటగాళ్లు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది.

భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడిన వెంటనే ఐపీఎల్ ఆడలేరు. కొంచెం విరామం కావాలి. కాబట్టి గంగూలీ చెబుతున్నట్లు టీ20 ప్రపంచకప్‌కు ముందు అన్ని దేశాల ఆటగాళ్లను ఒక చోటికి చేర్చి ఐపీఎల్‌లో మిగతా 31 మ్యాచ్‌లను పూర్తి చేయడం అంత తేలిక కాదు. ఇక నవంబరు నెలాఖర్లో టీ20 ప్రపంచకప్ అయ్యాక ఐపీఎల్‌ను పున:ప్రారంభించే వీలుంది కానీ.. అప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు యాషెస్ సిరీస్. ఆ రెండు దేశాల స్టార్లు లేకుండా ఐపీఎల్ ఆడిస్తే టోర్నీ కళ తప్పొచ్చు. అయినా పర్వాలేదనుకుంటే అప్పుడు లీగ్‌‌ను జరిపించడానికి అవకాశముంది.