కేసీఆర్ కర్ఫ్యూ మాటకు హైదరాబాద్ రెస్సాన్స్ ఇదే

కేసులు పెరిగిపోతున్నాయి. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా స్పందించండి మహా ప్రభో.. అన్న విన్నపాల్ని పట్టించుకోని కేసీఆర్ సర్కారు.. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఘాటు వ్యాఖ్యలకు వెంటనే స్పందించటం.. మంగళవారం రాత్రి నుంచి కర్ఫ్యూ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటం తెలిసిందే. ఈ జీవో విడుదల కావటానికి కొన్ని గంటల ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా పాజిటివ్ గా తేలటం షాకింగ్ గా మారింది.

తరచూ జాగ్రత్తలు తీసుకోవటమే కాదు.. ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకున్నారో లేదో కూడా ఇప్పటికి అధికారిక సమాచారం లేదు. అలాంటి ఆయనకు పాజిటివ్ గా తేలిన తీరు చూసినప్పుడు తెలంగాణలో కేసుల తీవ్రత ఎంతలా పెరిగిందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. కేసీఆర్ సర్కారు కర్ఫ్యూ ఆదేశానికి హైదరాబాద్ మహానగరంతో పాటు.. యావత్ రాష్ట్రం ఏ తీరులో స్పందించిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

రాత్రి తొమ్మిది గంటల నుంచి కర్ఫ్యూ మొదలవుతుందన్న దానికి రాత్రి ఏడున్నర నుంచే ఆ ప్రభావం కనిపించింది. రాత్రి ఎనిమిది గంటలు అయ్యేసరికి రోడ్ల మీద జనసంచారం తగ్గిపోవటమే కాదు.. వాహనాల హడావుడి తగ్గింది. అంతేకాదు.. నిద్రపోనట్లుగా ఉండే నగరం అందుకు భిన్నంగా రహదారులు నిర్మానుష్యంగా మారిపోయాయి. వీధులన్ని కళ తప్పాయి. బస్టాండ్.. రైల్వే స్టేషన్లలోనూ కర్ఫ్యూ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపించింది.

మొత్తంగా.. లాక్ డౌన్ వేళ.. మహానగరం ఏ రీతిలో అయితే.. నిశ్శబ్దంగా తయారైందో.. మళ్లీ నాటి పరిస్థితులు గుర్తుకు వచ్చేలా సీన్ కనిపించింది. రాత్రి ఎనిమిది గంటలకే వాణిజ్య సంస్థలన్ని మూసి వేయటంతో.. మహానగరం కళతప్పిన వైనం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. హైదరాబాద్ తో సహా యావత్ రాష్ట్రం మొత్తం కర్ఫ్యూ సానుకూలంగా స్పందించింది. వీధుల్లో జన సంచారం పూర్తిగా తగ్గిపోయి.. ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన సీన్ కనిపించింది.