కాళ్లు చేతులు కట్టేసిన అమ్మాయిది కూడా ఆ నాటకమే..

తప్పును తప్పుగా ఎత్తి చూపటం కూడా తప్పే అవుతోంది. పోలీసులకు చెమటలు పట్టిస్తూ.. తాము బాధితులుగా మారినట్లుగా కలరింగ్ ఇస్తూ.. మీడియాను.. జనాల్ని పిచ్చోళ్లను చేసే కొందరు అమ్మాయిల తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. అలాంటి వారంతా మర్చిపోతున్న విషయం ఏమంటే.. ఇలాంటి నాటకాలు సినిమాల్లోనూ.. టీవీ సీరియల్స్ లోనూ నడుస్తాయేమో కానీ.. రియల్ లైఫ్ లో ఏమాత్రం వర్క్ వుట్ కావు. అంతేకాదు.. గుట్టు రట్టు చేయటమే కాదు.. మోసం చేసిన ముఖాన్ని చూపించలేని దారుణ పరిస్థితులు ఉంటాయన్న వాస్తవాన్ని గుర్తిస్తే మంచిది.

ఇలాంటి తీరు వల్ల జరిగే మరో నష్టం ఏమంటే.. అసలైన బాధితుల విషయంలో పోలీసులు స్పందించే తీరులోనూ తేడా వస్తుందన్నది మరర్చిపోకూడదు. ఈ నెల ఒకటిన విజయనగరం జిల్లా గుర్లలోని అడవిలో ఒక విద్యార్థిని చేతులు.. కాళ్లు కట్టేసిన స్థితిలో కనిపించటం.. ఆ అమ్మాయిని ఎవరు అలా చేశారన్నది సంచలనంగా మారింది. సొమ్మసిల్లి పడిపోయినట్లుగా ఉన్న ఆ అమ్మాయికి సంబంధించిన విషయాల్ని పోలీసులు బయటపెట్టారు.

విజయనగరంలోని ఒక హాస్టల్ లో ఉంటూ.. ప్రైవేటు కాలేజీలో డిగ్రీచదువుతున్న ఈ అమ్మాయి.. ఫిబ్రవరి 27న అదే ఊళ్లో ఉన్న తమ బాబాయ్ ఇంటికి వెళుతున్నట్లు చెప్పి.. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న స్నేహితుడి దగ్గరకు వెళ్లింది. అదే సమయంలో.. ఆమె సోదరుడు వాకబు చేయటం ప్రారంభించారు. విషయం తెలిసి 28న యువతి.. పాలకొల్లు – పాలకొండ ట్రావెల్స్ బస్సు ఎక్కి విజయనగరం బయలుదేరింది. ఇంట్లో వారికి ఎలా చెప్పాలన్న ఆలోచనలో.. అప్పుడెప్పుడో పేపర్లో చదివిన వార్త గుర్తుకు వచ్చింది. స్థానికంగా ఉన్న స్టేషన్ లో సాయంత్రం అయితే ఎవరూ ఉండరన్న వార్త సారాంశాన్ని గుర్తుపెట్టుకొని అర్థరాత్రి వేళ గుర్ల దాటిన తర్వాత బస్సు దిగింది.

రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్లి అందరిని నమ్మించేందుకు తనకు తానే కాళ్లు.. చేతులను చున్నీతో కట్టేసుకొని.. అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లుగా నటించింది. అటువైపు వెళుతున్న వారు గుర్తించి.. నిజంగానే బాధితురాలని భావించి సపర్యలు చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. కేసు విచారణలో ఆమెకు సంబంధించిన పలు వివరాలు బయటకు రావటంతో.. వాటిని ముందు పెట్టి అసలేం జరిగిందన్న విషయాన్ని చెప్పాలని పోలీసులు అడగటంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిజం ఒప్పుకుంది. ఇలాంటి నాటకాలు ఆమెకే కాదు..చుట్టు ఉన్న సమాజానికి ఏమాత్రం మంచిది కాదన్నది మర్చిపోకూడదు.