లింగమార్పిడి తరువాత ఆట తీరు మారింది

మాజీ టీమిండియా క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడిగా జన్మించిన అనయా బంగర్, జెండర్ ట్రాన్సిషన్ తర్వాత మహిళగా తన జీవితాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మహిళల ప్రొఫెషనల్ క్రికెట్‌లో రెగ్యులర్‌గా ఆడాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం అక్కడ కమ్యూనిటీ క్రికెట్ ఆడేందుకు ఆమెకు అర్హత లభించింది.

ట్రాన్స్‌జెండర్ మహిళ అయిన అనయా 2024లో హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ప్రారంభించారు. ట్రాన్సిషన్ తర్వాత తన శరీరంలోనే కాదు, ఆటలో కూడా ఎలాంటి మార్పులు వచ్చాయో ఇటీవల వివరించారు. తనకు కుటుంబం అండగా ఉన్నప్పటికీ, పెద్ద పోరాటాలు మాత్రం తానే ఎదుర్కొన్నానని చెప్పారు. హార్మోన్ థెరపీ మొదలైన తర్వాత స్టామినా, మసిల్ మాస్‌తో పాటు బోన్ మినరల్ డెన్సిటీ కూడా తగ్గిందని తెలిపారు.

టెస్టోస్టెరాన్ సప్రెసెంట్స్, ఈస్ట్రోజెన్ తీసుకోవడంతో శరీరంలో రెండోసారి ప్యూబర్టీ తరహా మార్పులు వస్తాయని అనయా తన అనుభవాన్ని వివరించారు. సర్జరీ కూడా చేయించుకున్నట్లు చెప్పారు. బలం తగ్గడంతో తన ఆటతీరు కూడా మారిందని, ప్రస్తుతం టెస్టోస్టెరాన్ స్థాయి 0.6 ఎన్ఎంఓఎల్/ఎల్‌గా ఉందని వెల్లడించారు. అథ్లెట్‌గా తన సామర్థ్యంపైనా దీని ప్రభావం పడిందని చెప్పారు.

ఇంగ్లండ్‌లో ఉన్న సమయంలో మాంచెస్టర్ యూనివర్సిటీతో జరిగిన ఓ అధ్యయనంలో కూడా అనయా పాల్గొన్నారు. 12 వారాల పాటు లంగ్ కెపాసిటీ, హిమోగ్లోబిన్, పవర్ అవుట్‌పుట్ సహా పలు అంశాలను పరీక్షించినట్లు చెప్పారు. ఆ ఫలితాలను మహిళా అథ్లెట్ల డేటాతో పోల్చగా, తన రిజల్ట్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయని తెలిపారు. ఇక 2027 మార్చిలో మరోసారి పరీక్షల తర్వాత ఎలైట్ మహిళల క్రికెట్‌లో అవకాశం గురించి క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకోనుంది.

ఇక అనయా లక్ష్యం భారత్ తరఫున ఆడటమే. మహిళల క్రికెట్‌లో భారత్‌కు వరల్డ్ కప్ అందించాలని, ఒలింపిక్స్‌లో పతకం గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. గతంలో విరాట్ కోహ్లీని ఎక్కువగా అభిమానించేవారినని, ఇప్పుడు అభిషేక్ శర్మ ఆట నచ్చుతుందని తెలిపారు. మహిళా క్రికెటర్లలో స్మృతి మంధాన తన ఫేవరెట్ అని, గతంలో సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్‌లతో కలిసి కూడా క్రికెట్ ఆడినట్లు చెప్పారు.