ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్‌సీడీ 4.0 కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 2,82,38,795 మందికి పరీక్షలు పూర్తయ్యాయి. 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న జనాభాను లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 66.05 శాతం పరీక్షలు నిర్వహించారు.

సర్వేలో భాగంగా ఆగస్టు వరకు రాష్ట్రంలో మొత్తం 59.29 లక్షల అధిక రక్తపోటు కేసులు గుర్తించారు. వీటిలో తాజా సర్వే ద్వారా 11.79 లక్షల కొత్త బీపీ కేసులు వెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా మొత్తం 48.15 లక్షల మధుమేహం కేసులు గుర్తించగా, తాజా సర్వేలో 10.72 లక్షల కొత్త కేసులు గుర్తించారు. మిగిలిన కేసులు గతంలో నిర్వహించిన సర్వేల ద్వారా గుర్తించినవని అధికారులు తెలిపారు.

అధిక రక్తపోటు కేసుల శాతంలో బాపట్ల జిల్లా 19.65 శాతంతో మొదటి స్థానంలో ఉంది. కోనసీమ 19.45, పశ్చిమ గోదావరి 19.05, కృష్ణా 17.97, తూర్పు గోదావరి 17.77 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5.63, శ్రీ సత్యసాయి 8.47, అన్నమయ్య 9.93, చిత్తూరు 10.10, కర్నూలు 10.28 శాతం నమోదయ్యాయి.

మధుమేహం కేసుల శాతంలో బాపట్ల 16.89 శాతంతో మొదటి స్థానంలో ఉంది. పశ్చిమ గోదావరి 15.89, తూర్పు గోదావరి 15.23, ప్రకాశం 15.19, కృష్ణా 15.01 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1.51, పోలవరం 5.88, శ్రీ సత్యసాయి 6.56, కర్నూలు 6.86, పార్వతీపురం మన్యం 7.14 శాతం నమోదయ్యాయి. ఈ మేరకు ఒక నివేదికను ఈరోజు అధికారులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి అందజేశారు