బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా అంచ‌నాల‌కు చాలా దూరంలో ఆగిపోయింది. భ‌గ‌వంత్ కేస‌రి నుంచి మెయిన్ ప్లాట్ తీసుకున్న టీం.. ఆ క‌థ‌కు చాలా మార్పులు చేర్పులు చేసి సినిమాను గొప్ప‌గా త‌యారు చేద్దామ‌ని చూసింది కానీ, ఫ‌లితం లేక‌పోయింది.

నెగెటివ్ టాక్ తెచ్చుకున్న జ‌న‌నాయ‌గ‌న్ విజ‌య్ స్టార్ ప‌వ‌ర్ వ‌ల్ల త‌మిళ‌నాడు వ‌ర‌కు బాగానే ఆడుతోంది. మిగ‌తా చోట్ల పెద్ద‌గా ప్ర‌భావం చూప‌ట్లేదు. తెలుగులో అయితే జ‌న‌నాయ‌కుడు బాగా త‌డ‌బ‌డుతున్నాడు. ఈ సినిమాకు స‌రైన ప్ర‌మోష‌న్ కూడా లేక‌పోవ‌డం మైన‌స్ అవుతోంది. త‌మిళంలో ద‌ర్శ‌కుడు హెచ్‌.వినోద్ ఒక్క‌డే ప్ర‌మోష‌న్ భారాన్ని భుజాన వేసుకుని క‌ష్ట‌ప‌డుతున్నాడు. విడుద‌ల‌కు ముందే కాదు, త‌ర్వాత కూడా అత‌ను వ‌రుస‌గా ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు.

తాజాగా ఒక‌ పోస్ట్ రిలీజ్ ఇంట‌ర్వ్యూలో సెన్సార్ బోర్డు తీరును అత‌ను తీవ్రంగా త‌ప్పుబ‌డ్టాడు. ఈ సినిమాకు సెన్సార్ పూర్తి కావ‌డంలో విప‌రీత‌మైన జాప్యం జ‌రిగి సంక్రాంతికి రావాల్సిన సినిమా.. ఇప్పుడు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఐతే ఇప్ప‌టికి సినిమాను క్లియ‌ర్ చేస్తూ ఎ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డం ప‌ట్ల అత‌ను తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ముందు యు-ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చార‌ని, త‌ర్వాత దాన్ని మార్చార‌ని.. ఇదేం న్యాయ‌మ‌ని అత‌ను ప్ర‌శ్నించాడు. యు-ఎ ఇవ్వాలంటే 20 నిమిషాల స‌న్నివేశాలు తొల‌గించాలని ష‌ర‌తు పెట్టిన‌ట్లు అత‌ను వెల్ల‌డించాడు.

ఈ సినిమాలో త‌ల తెగిపడే స‌న్నివేశాల గురించి సెన్సార్ బోర్డు అభ్యంత‌ర పెట్టింద‌ని.. కానీ బాల‌కృష్ణ సినిమా డాకు మ‌హారాజ్‌లో, ర‌జినీకాంత్ మూవీ జైల‌ర్‌లో అలాంటి సీన్లే ఉన్నా వాటికి యు-ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చార‌ని.. కానీ త‌మ సినిమాకు మాత్రం అదే సీన్ మీద అభ్యంత‌రంతో ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చార‌ని.. ఇలా ఒక్కో సినిమాకు ఒక్కో ర‌కంగా ఎలా స‌ర్టిఫికెట్ జారీ చేస్తార‌ని అత‌ను ప్ర‌శ్నించాడు. విజ‌య్ చివ‌రి చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియ‌న్స్ పిల్ల‌ల‌తో క‌లిసి ఎంజాయ్ చేయాల‌ని ఆశించామ‌ని, కానీ ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి వారికి అడ్డుక‌ట్ట వేశార‌ని వినోద్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.