బొద్దింక‌ల‌పై తుపాకులు ఎక్కుపెట్టిన పోలీసులు!

పార్ల‌మెంటు ముట్ట‌డికి పిలుపునిచ్చిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై ఢిల్లీ పోలీసులు తుపాకులు ఎక్కు పెట్టారు. పార్ల‌మెంటు స‌హా ఢిల్లీ వ్యాప్తంగా సోమ‌వారం ఉద‌యం నుంచి 144 సెక్ష‌న్ విధించిన పోలీసులు.. సీజేపీ కార్య‌కర్తలను ఎక్క‌డిక‌క్క‌డ నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. సోమ‌వారం ఉద‌యం నాటికే సుమారు 50 వేల మందికి పైగా వివిధ రాష్ట్రాల నుంచి వ‌చ్చిన సీజేపీ కార్య‌క‌ర్త‌లు.. పార్ల‌మెంటు ముట్ట‌డి చేసి తీరుతామ‌ని ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు కూడా అంతే తీవ్రంగా స్పందించారు.

భారీ ఎత్తున బారికేడ్ల‌ను ఏర్పాటు చేశారు. కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేస్తామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఈ క్ర‌మంలోనే తొలుత 144 సెక్ష‌న్ విధించారు. అయిన‌ప్ప‌టికీ సీజేపీ కార్య‌క‌ర్త‌లు ఎక్క‌డా లొంగ‌కుండా ముందుకు సాగారు. పార్ల‌మెంటు వీధుల‌ను తొలుత అష్ట‌దిగ్భంధం చేశారు. పోలీసుల హెచ్చ‌రిక‌ల‌ను కాద‌ని.. భారీ సంఖ్య‌లో సీజేపీ కార్య‌క‌ర్త‌లు పార్ల‌మెంటు ప్రాంగ‌ణానికి చేరుకున్నారు. దీంతో పార్ల‌మెంటు గేట్ల‌ను సిబ్బంది మూసివేసి తాళాలు వేశారు. అనంత‌రం.. వంద‌లాదిమంది పోలీసులు భారీ బారికేడ్లు పెట్టి కార్య‌క‌ర్త‌ల‌ను అడ్డుకున్నారు.

ఒకానొక ద‌శ‌లో కార్య‌క‌ర్త‌ల‌ను నిలువ‌రించేందుకు.. తొలుత భాష్ప‌వాయు గోళాల‌ను పేల్చారు. అయిన‌ప్ప‌టికీ ఆందో ళన కారులు..వెన‌క్కిత‌గ్గ‌కుండా ముందుకుసాగారు. దీంతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొన్నాయి. మ‌రోవైపు.. సీజేపీ కార్య‌క‌ర్త‌లు స‌హా.. ఎవ‌రికీ నిర‌స‌న తెలిపేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని.. తీవ్ర‌స్థాయిలో చ‌ర్య‌లు తీసుకుంటా మ‌ని ఢిల్లీ పోలీసు క‌మిష‌న‌ర్ హెచ్చ‌రించారు.

అయితే.. తుపాకుల‌తో త‌మ గొంతు నొక్క‌లేర‌ని.. సీజేపీ కార్య‌క‌ర్త‌లు తెలిపారు. దీంతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. నిర‌స‌న కారుల‌పై పోలీసులు లాఠీల‌తో విరుచుకుప‌డుతున్న దృశ్యాలు క‌నిపించాయి. ప‌లు చోట్ల పోలీసుల‌పై నిర‌స‌న కారులు తిర‌బ‌డిన దృశ్యాలు కూడా అగుపించ‌డం గ‌మ‌నార్హం.

వాంగ‌చుక్ నిర‌స‌న‌..

పార్ల‌మెంటు ముట్ట‌డి నిర‌స‌న‌లో పాల్గొనేందుకు వెళ్తాన‌ని తెలిపిన ప్ర‌ముఖ విద్యావేత్త‌ సోన‌మ్ వాంగ్ చుక్‌ను ఆసుప‌త్రిలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఆయ‌న ఆరోగ్యం బాగోలేద‌ని వైద్యులు తెలిపార‌ని, అందుకే ఆయ‌న‌ను నిలువ‌రించామ‌ని తెలిపారు. అయితే.. పోలీసుల చ‌ర్య‌ల‌ను నిర‌సిస్తూ.. బెడ్ పైనుంచే సోన‌మ్ త‌న సంఘీభావం వ్య‌క్తం చేశారు.