బాబోయ్.. డిటర్జెంట్‌ పొడితో 2.3 కోట్ల లీటర్ల పాలు తయారు?

 మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన (ఎఫ్‌డీఏ) సంయుక్తంగా నిర్వహించిన దర్యాప్తులో డిటర్జెంట్ పొడి, పామ్ ఆయిల్, నాసిరకం రసాయనాలతో సింథటిక్ పాలను తయారు చేసి మార్కెట్‌లో విక్రయించినట్లు గుర్తించారు. గత ఆరు నెలల్లో సుమారు 2.3 కోట్ల లీటర్ల కల్తీ పాలు వినియోగదారులకు చేరి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

దర్యాప్తులో నిందితుల విక్రయ రిజిస్టర్లను పరిశీలించగా, సుమారు 2,30,470 కిలోల నాసిరకం పాలపొడితో 23,04,070 లీటర్ల సింథటిక్ పాలు తయారు చేసినట్లు తేలింది. దీని విలువ సుమారు రూ.9.21 కోట్లుగా అంచనా వేశారు.

అధికారుల వివరాల ప్రకారం, ప్రతి 100 లీటర్ల స్వచ్ఛమైన పాలలో 10 లీటర్ల సింథటిక్ పాలు కలిపి విక్రయించినట్లు గుర్తించారు. ఈ లెక్కన భూమ్ ప్రాంతంలోని పాల సేకరణ కేంద్రాల నుంచి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు 2.3 కోట్ల లీటర్లకు పైగా కల్తీ పాలు సరఫరా చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సింథటిక్ పాలు అసలైన పాలలా కనిపించేలా, కొవ్వు శాతం పెరిగినట్లు చూపించేందుకు డిటర్జెంట్ పొడి, పామ్ ఆయిల్, నాసిరకం రసాయన పొడులను ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ వ్యవహారంలో ఏడుగురిపై పోలీసులు పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసు నమోదై ఎనిమిది రోజులు గడిచినా నిందితులు పరారీలో ఉండటంతో, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

 రోజూ పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎక్కువగా తీసుకునే పాలలోనే డిటర్జెంట్, రసాయనాలు కలపడం అత్యంత ప్రమాదకరం. వైద్యుల హెచ్చరికల ప్రకారం ఇలాంటి పాలను తరచూ తీసుకుంటే కాలేయం, మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. అంతేకాదు, ఈ తరహా కుంభకోణాలు ఒక్క రాష్ట్రానికే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.