నీట్ పరీక్ష పెద్ద ప్రహసనంగా మారింది. పరీక్ష నిర్వహణలో రోజుకో వివాదం తలెత్తుతోంది. రీ నీట్ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పరీక్ష రాయబోతున్న నాగ్పూర్కు చెందిన మహ్మద్ అబ్దుల్లా తాలిబ్ అనే విద్యార్థికి పరీక్షా కేంద్రంగా అబుదాబీలోని ఒక పాఠశాలను కేటాయించారు. అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ విషయం తెలిసి విద్యార్థి కుటుంబం షాక్కు గురైంది.
విద్యార్థి తండ్రి మహ్మద్ తాలిబ్ మాట్లాడుతూ, శుక్రవారం సాయంత్రం అడ్మిట్ కార్డు చూసినప్పుడు అబుదాబీలోని పాఠశాల పరీక్షా కేంద్రంగా కనిపించిందన్నారు. తాము దరఖాస్తులో అలాంటి ఎంపిక చేయలేదని చెప్పారు.
వెంటనే హెల్ప్లైన్కు ఫోన్ చేయగా ఈ-మెయిల్ పంపాలని సూచించారని తెలిపారు. ఈ-మెయిల్ పంపిన తర్వాత శనివారం సాయంత్రం 4 గంటలలోపు కొత్త అడ్మిట్ కార్డు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
దరఖాస్తు సమయంలో మూడు జిల్లాలను మాత్రమే ఎంపిక చేశామని, ఇప్పుడు నాగ్పూర్లోనే పరీక్షా కేంద్రం ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. ఇతర జిల్లాలకు వెళ్లేందుకు కూడా సమయం లేదన్నారు.
అడ్మిట్ కార్డులో విదేశీ కేంద్రం రావడంతో తమ కుమారుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడని, పరీక్ష రాయనని కూడా అన్నాడని తండ్రి తెలిపారు. అయితే అతని తల్లి ధైర్యం చెప్పడంతో పరీక్ష రాయడానికి సిద్ధమవుతున్నాడన్నారు.
“మా కుమారుడికి పాస్పోర్ట్ కూడా లేదు. అలాంటప్పుడు అబుదాబీలో కేంద్రం ఎలా కేటాయించారో అర్థం కావడం లేదు” అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొత్త అడ్మిట్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates