ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి మండలం జన్వాడలో ఉన్న చెరువును పవన్ కబ్జా చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ఆరోపణలపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారి స్పందించారు.
ఒకవేళ తాను ఆ చెరువును, భూమిని కబ్జా చేశానని నిరూపిస్తే దానిని తెలంగాణ ప్రభుత్వానికి రాసిచ్చేస్తానంటూ పవన్ సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ నిజంగా తాను చెరువు కబ్జా చేస్తే తన ఇల్లు తగలబెట్టేశేవారని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటే తనకు ఇష్టమని, గౌరవమని, ఆయనకు చెబుతున్నానని…ప్రభుత్వానికి చెబుతున్నానని..ఆ చెరువు తాను కబ్జా చేశానని నిరూపిస్తే ఆ చెరువును సంతోషంగా తెలంగాణ ప్రభుత్వానికి రాసిచ్చేస్తానని పవన్ చెప్పారు.
తాను చెరువును కబ్జా చేశానని కొందరు అంటున్నారని, తనకేం పనిలేదా అని పవన్ ప్రశ్నించారు. ఆ చెరువు దగ్గర తనకున్న స్థలంలో తనకు గోశాల ఉందని, 60 నుంచి 70 గోవులుంటాయని, వాటి గడ్డి కోసం ఆ స్థలం ఉందని పవన్ క్లారిటీనిచ్చారు.
ప్రైవేటు స్థలాల్లోకి రావడం చట్టప్రకారం నేరమని, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టవద్దని అన్నారు. తమను భయపెట్టాలని చూడొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని పవన్ హెచ్చరించారు. అవన్నీ ఆలోచించుకోవాలని, తనను భయపెట్టాలని చూస్తే భయపడేవాడిని కాదని అన్నారు. తనపై ఆంధ్రా ముద్ర వేసి ప్రాంతీయ వాదం తెరపైకి తెస్తే ఊరుకోబోనని, తెలంగాణలో అన్ని కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలకు చెందిన వారు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని గుర్తు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates