జస్ట్ 4 రోజుల్లో రూ.వెయ్యి కోట్లకు పైనే తాగేశారు

తెలంగాణలో గడిచిన నాలుగు రోజులుగా సాగిన మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తున్నాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు తెలంగాణ వ్యాప్తంగా మందు అమ్మకాలు మా జోరుగా సాగినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు వేడుకలపై నియంత్రణ.. బార్లు.. పబ్బులపై పరిమితులు ఉన్న వేళలోనూ.. భారీగా అమ్మకాలు సాగటం ఆసక్తికరంగా మారింది.

డిసెంబరు నెలలోని చివరి నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా రూ.1068.4 కోట్ల మద్యం.. బీరు అమ్మకాలు సాగినట్లుగా లెక్కలు తేలాయి. డిసెంబరు 31 రాత్రి పన్నెండు గంటల వరకు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఓకే చెప్పిన నేపథ్యంలో అమ్మకాలు భారీగా సాగాయి. రాష్ట్రంలో2216 మద్యం దుకాణాలు.. వెయ్యికి పైగా బార్లు.. క్లబ్బులు.. హోటళ్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ మద్యం అమ్మకాలు జోరుగా సాగినట్లుగా చెబుతున్నారు.

మద్యంఅమ్మకాల కారణంగా ఒక్క డిసెంబరు నెలలో రాష్ట్రానికి వచ్చిన పన్ను ఆదాయం రూ.2,714.76 కోట్లు. ఇంత భారీగా ఇటీవల కాలంలో ఎప్పుడూ రాలేదట. మద్యం అమ్మకాల పుణ్యమా అని.. రాష్ట్ర ఆదాయం భారీగా పెరిగిందని చెప్పాలి. దీంతో.. లాక్ డౌన్.. కరోనా కారణంగా నీరసించిన బొక్కసం కాసులతో కళకళలాడుతోందని చెప్పక తప్పదు.