ప్రస్తుతం పొదుపు మంత్రం పఠిస్తున్న కేంద్ర ప్రభుత్వం చమురు సహా బంగారం వంటివాటిపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ పరిధిలో చమురు వినియోగం తగ్గించేందుకు కాన్వాయ్లను ఇప్పటికే తగ్గించారు. ఇక, బంగారాన్ని ఏడాది పాటు కొనుగోలు చేయొద్దని ప్రధాని మోడీ స్వయంగా ప్రజలకు చెప్పారు. అనంతరం.. దీనిపై కస్టమ్స్ సుంకాన్ని 6-15 శాతానికి పెంచారు. ఫలితంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక.. ఈపరంపరలో తాజాగా వెండి దిగుమతులపై ఏకంగా నిషేధం విధించడం గమనార్హం.
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వెండి సహా.. వెండి వస్తువులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నిషేధం వచ్చే నెల 30వ తేదీ వరకు ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా వజ్రాలు పొదిగిన వెండి ఆభరణాలపై ఈ ఏడాది జూన్ 30 వరకు దిగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వస్తువుల దిగుమతి విధానాన్ని సమీక్షించినట్టు పేర్కొన్న ప్రభుత్వం… జూన్ 30, 2026 వరకు నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. ఇది తక్షణమే అమల్లోకి వచ్చేలా ‘స్వేచ్ఛ’ నుండి ‘పరిమితం’గా సవరించినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGTA) తెలిపింది.
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో డాలరుతో రూపాయి విలువ పడిపోయింది. ఈ క్రమంలోనే వెండి దిగుమతులపై నిషేధం విధించినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల ఫారెక్స్ నిల్వలు పెరుగుతాయన్న అంచనా ఉంది. అయితే.. ఇదేసమయంలో స్మగుల్ వ్యవహారం కూడా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదేసమయంలో దేశీయ మార్కెట్ను బలోపేతం చేయడానికి కూడా ఈచర్యలు దోహదపడనున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలలో ఉన్న లొసుగులను సరిదిద్దడానికి, ముఖ్యంగా థాయ్లాండ్ వంటి దేశాల నుండి తక్కువ ధరలకు ఆభరణాలు పెద్ద ఎత్తున దిగుమతి అవ్వడాన్ని అరికట్టడానికి కూడా దోహదపడుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో దేశీయ తయారీదారులను రక్షించడానికి ఉపయోగపడనుందని అంటున్నారు. అయితే.. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతి ఆధారిత యూనిట్ల దిగుమతులకు మినహాయింపు ఉంటుందని కేంద్రం పేర్కొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
