తెలంగాణలో బీర్ల రికార్డు.. ఏప్రిల్‌లోనే 6 కోట్ల బాటిళ్లు ఖాళీ!

తెలంగాణలో ఎండల తీవ్రత పెరగడంతో బీర్ల అమ్మకాలు గతంలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకున్నాయి. కేవలం ఏప్రిల్ నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఆరు కోట్ల బీరు బాటిళ్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. పెరిగిన ఉష్ణోగ్రతలు, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు, శుభకార్యాల సీజన్ కలిసి రావడంతో మద్యం దుకాణాల వద్ద జనం క్యూ కట్టారు. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం గతేడాది ఏప్రిల్‌లో 41.39 లక్షల కేసులు అమ్ముడవగా, ఈసారి అది ఏకంగా 50.05 లక్షల కేసులకు పెరగడం రికార్డ్.

మార్చి నెల నుంచే ఈ ధోరణి కనిపిస్తోంది. గత ఏడాది మార్చిలో 39 లక్షల కేసులు అమ్ముడవగా, ఈ ఏడాది అదే సమయానికి 50 లక్షల కేసుల మార్కును దాటేసింది. అంటే గతేడాదితో పోలిస్తే సుమారు 11 లక్షల కేసుల బీర్లు అదనంగా అమ్ముడయ్యాయి. ఎండలు ముదురుతున్న కొద్దీ చల్లని బీర్లకు గిరాకీ విపరీతంగా పెరిగిపోవడంతో అమ్మకందారులు కూడా స్టాక్ ఉంచుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం రోజుకు మూడు లక్షల కేసుల అవసరం ఉండగా, కంపెనీలు కేవలం రెండు లక్షల కేసులు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నాయి.

డిమాండ్‌కు తగ్గట్టుగా సప్లై లేకపోవడంతో ఎక్సైజ్ శాఖ కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. డిపోల వద్ద రేషనింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. అంటే లిక్కర్ షాపు యజమానులు అడిగినంత స్టాక్ ఇవ్వకుండా, ఉన్న నిల్వలను అందరికీ సమానంగా పంచుతున్నారు. ముఖ్యంగా పాపులర్ బ్రాండ్ల విషయంలో ఈ కోటాను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఉత్పత్తిని పెంచాలని తయారీ కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇంకా కొరత కనిపిస్తూనే ఉంది.

మధ్యాహ్నం వేళ ఎండల నుంచి ఉపశమనం కోసం, సాయంత్రం ఐపీఎల్ మజా కోసం జనం బీర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతుండటంతో ఫంక్షన్ హాళ్లలో కూడా బీర్ల వాడకం భారీగా పెరిగింది. ఈ పరిణామాల వల్ల ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం కురుస్తోంది. మే నెలలో ఎండలు ఇంకా ముదిరే అవకాశం ఉండటంతో అమ్మకాలు 75 లక్షల కేసుల వరకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి డిపోల్లో నిల్వలు నిండుకుంటున్నాయి. మే నెలలో గిరాకీ ఇంకా పెరిగితే పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.