దేశంలో వంట గ్యాస్ కు కొరత ఏర్పడితే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం ఇప్పటికే అర్థమైపోయిందనే చెప్పాలి. అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై నీలి నీడలు కమ్ముకోగా… యుద్ధం జరుగుతున్నా… గ్యాస్ లభ్యతకు వచ్చిన ఇబ్బందేమీ లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటింటించాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు గ్యాస్ కష్టాలు మొదలు అయ్యాయి. అయితే ఈ కష్టాలు గృహ వినియోగాన్ని తాకకున్నా… వాణిజ్య గ్యాస్ వినియోగాన్ని ఓ రేంజిలో ప్రభావితం చేయనుంది. వాణిజ్య గ్యాస్ రేట్లను కేంద్రం బారీగా పెంచడమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. వెరసి దేశవ్యాప్తంగా హోటళ్లలో గ్యాస్ బండ బాదుడు గట్టిగానే వినిపించనుంది.
దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల రేట్లను పెంచుతూ కేంద్రం శుక్రవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన రేట్లు శుక్రవారం నుంచే అమలులోకి వస్తాయని కూడా కేంద్రం తన ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. అంటే…శుక్రవారం ఉదయం నుంచి పెరిగిన గ్యాస్ ధరలను ఆయా గ్యాస్ కంపెనీలు ముక్కు పిండి మరీ వసూలు చేస్తాయన్న మాట. వాణిజ్య వినియోగానికి సంబంధించి గ్యాస్ కంపెనీలు 19 కేజీల సిలిండర్లను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిలిండర్ల రేట్లను కేంద్రం ఒకేసారి భారీగా పెంచేసింది.
ప్రస్తుతం 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ రేటు రూ.2078.50గా ఉంది. ఈ రేటును కేంద్రం ఒకేసారి ఏకంగా రూ.993 మేర పెంచింది. అంటే… శుక్రవారం నుంచి 19 కేజీల గ్యాస్ సిలిండర్ రేటు ఏకంగా రూ.3,071.50క చేరుతుంది. అంటే ఒకేసారి ఈ రేటును కేంద్రం 50 శాతం మేర పెంచిందన్న మాట. 50 శాతం మేర గ్యాస్ రేటును కేంద్రం పెంచితే… ఆ మేర వాణిజ్య సముదాయాలు… ప్రత్యేకించి జనంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న హోటళ్లు తమ రేట్లను కూడా 50 శాతం మేర పెంచడం ఖాయంగానే కనిపిస్తోంది. వెరసి హోటళ్లలో గ్యాస్ బండ బాదుడు ఓ రేంజిలో వినిపించనుందని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates