ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. గత సీజన్ ఛాంపియన్స్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం 18 ఓవర్లలోనే ఛేదించిందంటే వారి బ్యాటింగ్ ధాటి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్సీబీ లాంటి పటిష్టమైన జట్టును ఓడించడం సామాన్యమైన విషయం కాదు. రాజస్థాన్ రాయల్స్ ఈ ఘనతను చాలా సునాయాసంగా సాధించి చూపెట్టింది.
ఈ మ్యాచ్లో అసలైన హైలైట్ 15 ఏళ్ల ‘వండర్ కిడ్’ వైభవ్ సూర్యవంశీ. పవర్ప్లేలోనే ఆర్సీబీ బౌలర్ల పని పట్టిన ఈ కుర్రాడు, మ్యాచ్ను పూర్తిగా రాజస్థాన్ వైపు తిప్పేశాడు. ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ జోష్ హాజెల్ వుడ్, అనుభవం ఉన్న భువనేశ్వర్ కుమార్లను ఏమాత్రం లెక్కచేయకుండా వైభవ్ ఆడిన తీరు అద్భుతం. ఆర్సీబీ బ్యాటర్లందరూ కలిసి మ్యాచ్ మొత్తంలో 7 సిక్సర్లు కొడితే, వైభవ్ ఒక్కడే తన ఇన్నింగ్స్లో 7 భారీ సిక్సర్లు బాదడం విశేషం. కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు (8 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసిన వైభవ్, సెంచరీ చేసే లోపే అవుట్ అయినా అప్పటికే ఆర్సీబీ శిబిరంలో ఆందోళన మొదలైంది.
వైభవ్ విధ్వంసం తర్వాత రాజస్థాన్ వరుసగా మూడు వికెట్లు కోల్పోయి కాస్త తడబడింది. షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్ తక్కువ స్కోర్లకే అవుట్ అవ్వడంతో ఆర్సీబీకి ఒక చిన్న అవకాశం దక్కిందని అందరూ భావించారు. కానీ, ఆ ఆశలను ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా నీరుగార్చారు. జురెల్ ఎంతో ప్రశాంతంగా ఆడుతూ 43 బంతుల్లో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వైభవ్ ధాటిని కొనసాగిస్తూనే, వికెట్లు పడకుండా జాగ్రత్త పడి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. జడేజా కూడా తన అనుభవాన్ని జోడించి 24 పరుగులతో సహకరించడంతో రాజస్థాన్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
బెంగళూరు ఇన్నింగ్స్ విషయానికి వస్తే, రజత్ పాటిదార్ (63) తన నాయకత్వ బాధ్యతను చక్కగా నెరవేర్చాడు. విరాట్ కోహ్లీ (32), ఫిలిప్ సాల్ట్ విఫలమైనా, మిడిల్ ఆర్డర్ లో రొమారియో షెపర్డ్, వెంకటేష్ అయ్యర్ మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ 201 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అయితే, రాజస్థాన్ బౌలింగ్లో రవి బిష్ణోయ్, జోఫ్రా ఆర్చర్ పొదుపుగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు తీశారు. ముఖ్యంగా పవర్ ప్లేలో ఆర్సీబీని కట్టడి చేయడంలో రాజస్థాన్ బౌలర్లు సఫలమయ్యారు. కానీ, ఆర్సీబీ బౌలింగ్ మాత్రం వైభవ్ ధాటికి విలవిలలాడింది.
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ఒక పవర్ఫుల్ జట్టుగా ఎదుగుతోంది. వరుసగా నాలుగు మ్యాచ్లలో తన సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ, ఇప్పుడు ప్రతి జట్టుకు ఒక పెద్ద సవాల్గా మారాడు. కేవలం 15 ఏళ్ల వయసులో దిగ్గజాలను ఎదుర్కొంటూ అతను చూపుతున్న ఫామ్ చూస్తుంటే, ఈ సీజన్ లో రాజస్థాన్ను ఆపడం ఎవరికైనా కష్టమే అనిపిస్తోంది. ఆర్సీబీ లాంటి ఛాంపియన్ జట్టును ఇంత దారుణంగా ఓడించడం రాజస్థాన్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఈ ‘వండర్ కిడ్’ ప్రయాణం మున్ముందు ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates