ఏపీలో సంచలనం రేపుతున్న ‘దిశ’ తరహా కేసు


నిర్భయ ఉదంతం మీద అంత చర్చ జరిగింది. జనాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిందితులందరికీ శిక్ష పడింది. కాస్త ఆలస్యమైనప్పటికీ నలుగురిని ఉరి తీశారు. ఇక తెలంగాణలో అయితే ఓ అమ్మాయిపై అఘాయిత్యానికి ఒడికట్టి తనను పెట్రోల్ పోసి తగలబెట్టేసిన నలుగురినీ కొన్ని రోజులకే ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. ఇంత జరిగినా దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలేమీ ఆగిపోలేదు. ఎక్కడో ఒక చోట తరచుగా ఇలాంటి ఘోరాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఒక అమ్మాయి బలైపోయింది. ఆ అమ్మాయి పేరు.. స్నేహలత. 19 ఏళ్ల వయసుకే ఓ బ్యాంకులో ఆమె ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తోంది. కుటుంబ కారణాల వల్ల డిగ్రీ రెండో సంవత్సరంలోనే చదువు ఆపేసి.. ఉద్యోగంలో చేరి తల్లిదండ్రలకు అండగా నిలుస్తోంది.

అలాంటి అమ్మాయిని ఇద్దరబ్బాయిలు దారుణంగా చంపేశారన్నది ఆరోపణ. పాక్షికంగా కాలిపోయిన ఆ అమ్మాయి శవం అనంతపురం శివార్లలో దొరకడం సంచలనం రేపింది. స్నేహలత ఎనిమిదో తరగతిలో ఉన్నప్పటి నుంచి రాజేష్ అనే కుర్రాడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడట. ఆమె డిగ్రీలో చేరే సమయానికి కూడా అతను విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న సమయంలలో వెంట పడి వేధిస్తూ వచ్చాడట. ఐతే చివరగా స్నేహలతతో అతడికి ఏం గొడవ జరిగిందో కానీ.. తన స్నేహితుడైన కార్తీక్‌తో కలిసి అతను ఆమెను చంపేశాడన్నది ఆరోపణ. స్నేహలతను హత్య చేశాక ఏం చేయాలో తెలియక దగ్గర్లో ఉన్న కాగితాలు, చెత్త వేసి నిప్పు పెట్టారు. దీంతో శరీరం పాక్షికంగా కాలింది.

మృతదేహాన్ని ఎవరో గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లొచ్చి పక్కనే పడి ఉన్న స్నేహలత బ్యాగ్‌లో ఉన్న ఐడీ ఆధారంగా అడ్రస్ తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బిడ్డ శవం ముందు పడి ఆ తల్లి రోదిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కూతుర్ని రాజేష్ వేధిస్తున్నట్లు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. ఇళ్లు మారితే సమస్య తీరిపోతుంది కదా అని పోలీసులు సలహా ఇచ్చారని స్నేహలత తల్లి ఆరోపించింది. మధ్యాహ్నం భోంచేస్తున్నా, ఇంటికొచ్చేస్తా అన్న అమ్మాయి ఇలా అయిపోతుందని.. తనను చంపేస్తారని ఊహించలేదని ఆమె వాపోయింది. స్నేహలత దళిత అమ్మాయి కావడం.. పోలీసులు నిర్లక్ష్యం వహించినట్లు స్పష్టమవుతుండటంతో దళిత సంఘాలు రంగంలోకి దిగాయి. ఇష్యూ పెద్దదైపోయింది.