ఏపీలో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది సజీవ దహనం అయ్యారు. మరో 28 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 10 మందికి పైగా క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం యావత్తు దేశాన్ని షాక్ కు గురి చేసిందనే చెప్పాలి.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి ట్రావెల్స్ యాజమాన్యం, రాంగ్ రూట్ ప్రయాణాలే కారణమని చెప్పాలి. ఈ ప్రమాదం నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. చనిపోయిన వారితో పాటు క్షతగాత్రుల్లో మెజారిటి మంది మార్కాపురానికి చెందిన వారే. కొందరు నెల్లూరు జిల్లాకు చెందిన వారు. తెలంగాణలోని నిర్మల్ నుంచి ఈ బస్సు బయలుదేరింది.
13 మందిని సజవంగా దహించివేసిన ఈ ప్రమాదానికి గల కారణాలేమిటన్న వివరాల్లోకి వెళితే… హరిక్రిష్ణ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు అసలు కండీషన్ లోనే లేదట. దూర ప్రయాణాలు చేసేందుకు వీలు లేని ఈ బస్సును ఏడాదికి పైగా ట్రాలెవ్స్ యాజమాన్యం తిప్పుతూనే ఉందట. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో 45 మంది ప్రయాణికులతో ఈ బస్సు ఏపీకి ప్రయాణమైంది.
బస్సు కండీషన్ లో లేని కారణంగా ఏడాది క్రితమే రవాణా శాఖ అధికారులు దానికి ఫైన్ కూడా వేశారట. ఇక డొక్కు బస్సుతో రోడ్డెక్కిన డ్రైవర్లు… మితి మీరిన వేగంతో నడపడమే కాకుండా రాంగ్ రూటులోనూ కదం తొక్కించారట. మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద రాంగ్ రూట్ లోకి వచ్చేసిన బస్సు… ఎదురుగా వస్తున్న టిప్పర్ ను ఢీకొట్టింది. బస్సు కండీషన్ లో లేకపోవడం, రాంగ్ రూట్ లో ప్రయాణించడమే ప్రమాదానికి కారణాలుగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే… తెల్లవారుజామున ఎర్రగొండపాలెం వద్ద బస్సు మితి మీరిన వేగంతో కదులుతున్న సమయంలో బస్సు కండీషన్ సరిగా లేదంటూ ప్రయాణికులు డ్రైవర్ ను అప్రమత్తం చేశారట. దీంతో అతడు బస్సును ఆపి దాదాపుగా గంట పాటు బస్సుకు రిపేర్ చేసి ఆ తర్వాత తిరిగి ప్రయాణం మొదలుపెట్టాడట.
అయితే ఎంత రిపేర్ చేసినా… బస్సు స్టీరింగ్ కండీషన్ లోకి రాలేదట. స్టీరింగ్ సరిగా లేని కారణంగానే ప్రమాదానికి ముందు బస్సు రాంగ్ రూట్ లోకి వెళ్లినట్టు సమాచారం. ఏదేమైనా 13 మందిని పొట్టనబెట్టుకున్న ఈ ప్రమాదం బస్సు కండీషన్, ట్రావెట్స్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని చెప్పొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates