చివరకు సుప్రీం అనుమతితో కన్నుమూసిన హరీష్

సుప్రీంకోర్టు అనుమతితో ‘పాసివ్ యుతనేషియా’ (కారుణ్య మరణం) పొందిన తొలి భారతీయుడిగా హరీష్ రాణా మంగళవారం మధ్యాహ్నం 4:10 గంటలకు ఢిల్లీ ఎయిమ్స్‌లో కన్నుమూశారు. 13 ఏళ్లుగా అపస్మారక స్థితిలో, కేవలం కృత్రిమ ఆహారంపై బతుకుతున్న హరీష్‌కు ఈ మరణంతో శాశ్వత విముక్తి లభించింది. మన దేశ న్యాయ, వైద్య చరిత్రలో ఇదొక అరుదైన విషయం. ఒక వ్యక్తి గౌరవప్రదంగా మరణించే హక్కును అత్యున్నత న్యాయస్థానం ఈ కేసు ద్వారా హైలెట్ చేసింది.

హరీష్ రాణా కథ వింటే ఎవరికైనా కళ్లు చెమర్చుతాయి. 2013లో పంజాబ్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న సమయంలో, నాలుగో అంతస్తు బాల్కనీ నుండి ప్రమాదవశాత్తు కింద పడటంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుండి అతను కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. కదలలేడు, మాట్లాడలేడు.. కేవలం ఊపిరి మాత్రమే ఆడుతోంది. గడిచిన పదేళ్లకు పైగా ఆ పసిప్రాణం పడుతున్న నరకాన్ని చూసి తట్టుకోలేక, అతనికి కారుణ్య మరణం ప్రసాదించాలని కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు.

మొదట ఢిల్లీ హైకోర్టు ఈ విన్నపాన్ని తిరస్కరించినా, సుప్రీంకోర్టు మాత్రం హరీష్ పరిస్థితిని అర్థం చేసుకుంది. మెడికల్ బోర్డు నివేదికలను పరిశీలించిన తర్వాత, అతను మళ్లీ కోలుకునే అవకాశం అస్సలు లేదని తేలడంతో మార్చి 11న పాసివ్ యుతనేషియాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే, అతనికి అందుతున్న కృత్రిమ ఆహారాన్ని, వైద్య సహాయాన్ని నిలిపివేసి సహజంగా మరణించేలా చేయడం. దీనికోసం ఎయిమ్స్ వైద్యులతో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని కోర్టు ఏర్పాటు చేసింది.

ఎయిమ్స్‌లోని పాలియేటివ్ కేర్ యూనిట్‌లో వైద్యులు చాలా జాగ్రత్తగా ఈ ప్రక్రియను అమలు చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, ఎక్కడా అతనికి నొప్పి కలగకుండా చాలా గౌరవప్రదంగా లైఫ్ సపోర్ట్‌ను దశలవారీగా తొలగించారు. ఈ కేసులో 2018లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకున్నారు. ఒక వ్యక్తి తన జీవితంలో కోలుకోలేని స్థితికి చేరుకున్నప్పుడు, గౌరవంగా మరణించే హక్కు కూడా ప్రాథమిక హక్కులో భాగమేనని న్యాయస్థానం ఈ సందర్భంగా తెలియజేసింది.

హరీష్ మరణం ఒక విషాదమే అయినా, దశాబ్ద కాలంగా అతను అనుభవిస్తున్న చిత్రహింసల నుండి అతనికి లభించిన పెద్ద ఉపశమనం అని చెప్పాలి. ఈ ఘటన భవిష్యత్తులో ఇలాంటి కష్టాల్లో ఉన్న ఇతరులకు ఒక న్యాయపరమైన మార్గాన్ని చూపిందని చెప్పవచ్చు. కేవలం శవంలా పడి ఉండటం కంటే, గౌరవంగా ప్రాణాలు వదలడం మిన్న అనే ఆలోచనకు ఈ తీర్పు ద్వారా తెలిపారు.