అరెస్ట్ భయం.. RCBలో అతను లేనట్లే..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ పేసర్ యష్ దయాల్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, అతడు జట్టుతో చేరడం లేదని ఆర్‌సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ స్పష్టం చేశారు. గతేడాది ఆర్‌సీబీ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేకపోవడం జట్టు బౌలింగ్ విభాగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం అతడు కాంట్రాక్టులో ఉన్నప్పటికీ, జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేనేజ్‌మెంట్ వెల్లడించింది.

యష్ దయాల్ ప్రస్తుతం రెండు వేర్వేరు క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్లుగా శారీరక, మానసిక వేధింపులకు గురిచేశాడని ఘజియాబాద్‌లో ఒక మహిళ ఫిర్యాదు చేయగా, జైపూర్‌లో ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా 2025 ఐపీఎల్ సీజన్ జరుగుతున్న సమయంలోనే హోటల్‌లో ఈ ఘటన జరిగిందని బాధితురాలు పేర్కొనడం సంచలనం రేపింది. ఈ కేసుల్లో జైపూర్ పోక్సో కోర్టు అతడి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో అరెస్ట్ భయం పొంచి ఉంది.

యష్ దయాల్‌పై ఇలాంటి ఆరోపణలు ఉన్నప్పటికీ ఆర్‌సీబీ అతడిని రిటైన్ చేసుకోవడంపై వేలం ముందే విమర్శలు వచ్చాయి. అయితే ఇటీవల ట్రైనింగ్ సెషన్లకు అతడు రాకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. “యష్ ప్రస్తుతం వ్యక్తిగత ఇబ్బందుల్లో ఉన్నాడు, అతడికి మా మద్దతు ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతడు జట్టుతో ఉండటం ఎవరికీ మంచిది కాదు” అని బోబాట్ వివరించారు. లీగల్ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అతడు జట్టులో చేరే అవకాశాలు కనిపించడం లేదు.

దయాల్ దూరం కావడంతో ఆర్‌సీబీ బౌలింగ్ బాధ్యత ఇప్పుడు భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ వంటి సీనియర్ల భుజస్కంధాలపై పడింది. రూల్స్ ప్రకారం అతడు ఇంకా కాంట్రాక్టులోనే ఉన్నాడు కాబట్టి, అతడి స్థానంలో మరో కొత్త ఆటగాడిని తీసుకునే అవకాశం ప్రస్తుతానికి ఆర్‌సీబీకి లేదు. కృనాల్ పాండ్యా నేతృత్వంలోని స్పిన్ విభాగం, ఇతర పేసర్లు బాధ్యత తీసుకుంటే తప్ప బౌలింగ్ విభాగం దెబ్బతినే ప్రమాదం ఉంది. మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సీజన్ మొదలవుతుండటంతో జట్టు వ్యూహాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.