ఇడ్లీ, వడ తింటే… దాంతోపాటు గ్యాస్ బిల్లు కూడా

సోషల్ మీడియాలో ఓ రెస్టారెంట్ బిల్లు హాట్ టాపిక్‌గా మారింది. ఇడ్లీ, వడతో పాటు గ్యాస్ ఖర్చును కూడా విడిగా బిల్లులో చేర్చిన ఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చెన్నైలోని ఓ హోటల్‌లో సింగిల్ ఇడ్లీ, సింగిల్ వడ తీసుకున్న కస్టమర్‌కు గ్యాస్ ఛార్జీగా రూ.9.52ను బిల్లులో చేర్చినట్టు కనిపిస్తోంది. జీఎస్టీతో కలిపి మొత్తం బిల్లు సుమారు రూ.80గా చూపించడంతో ఈ బిల్లు నెట్టింట వైరల్‌గా మారింది.

ఇటీవల అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం, వాణిజ్య గ్యాస్ ఖర్చులు అధికమవడం వల్లే ఈ విధంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే “తిన్న ఆహారానికే కాకుండా వండిన గ్యాస్‌కూ డబ్బులు వసూలు చేస్తున్నారా?” అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత హోటళ్ల వ్యాపారంపై ప్రభావం చూపుతోందని వ్యాపారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు మూతపడగా, మరికొన్ని చోట్ల ఖర్చులను వినియోగదారులపై మోపుతున్నట్టు తెలుస్తోంది. గ్యాస్ కొరత కారణంగా ధరలు పెంచామని, వినియోగదారులు సహకరించాలని కొందరు హోటళ్లలో బోర్డులు కూడా పెట్టినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా గ్యాస్ కొరత ప్రభావం హైదరాబాదులోని పీజీ హాస్టళ్లపై కూడా పడుతోంది. ఐటీ కారిడార్ ప్రాంతాలైన గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్‌లలో వందలాది పీజీ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో పది లక్షల మందికిపైగా ఐటీ ఉద్యోగులు నివసిస్తున్నట్లు అంచనా.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో పీజీ హాస్టల్ నిర్వాహకులు మెనూలో కోత పెట్టుతున్నారు. ఎక్కువ గ్యాస్ అవసరమయ్యే వడ, పూరీ, దోశ వంటి వంటకాలను నిలిపివేసి, రైస్‌తో చేసే ఆహారాన్ని మాత్రమే అందిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు వ్యాపారులు కమర్షియల్ సిలిండర్లను బ్లాక్ చేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.