అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో నిందితులు ఎవరు? అసలీ దారుణం ఎలా జరిగింది? అనే విషయాలు ఇప్పటికీ తేలలేదు. విచారణపై విచారణ జరిగినా.. ఇప్పటికీ అయేషా మీరా కేసు మిలియన్ డాలర్ల సస్పెన్సుగానే ఉంది. రాష్ట్ర పోలీసులు.. సీఐడీ అధికారులు.. కేంద్రం పర్యవేక్షణలోని సీబీఐ అధికారులు సైతం ఈ కేసును విచారించారు. అయినా.. ఇప్పటికీ దోషులు ఎవరో తేలలేదు.
ఈ కేసు ముగింపు కోసం.. అయేషా మీరా తల్లిదండ్రులు 19 సంవత్సరాలుగా తల్లడిల్లుతున్నారు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి విన్నపాలుచేస్తున్నారు. కేంద్రానికి లేఖలు రాశారు. మానవ హక్కుల సంఘాలకు కూడా విన్నవించారు. అయినా.. ప్రయోజనం లేకుండా పోయింది. ఈ కేసులో తొలుత నిందితుడు అంటూ.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పిడతల సత్యంబాబును అరెస్టు చేసి జైలు పాలు చేసినా.. ఆ తర్వాత కోర్టు అతనిని నిర్దోషిగా విడుదల చేసింది.
ఇక, సీబీఐ ఈ కేసు విచారణను ముగించి ఏడాది అయినా ఇప్పటి వరకు నివేదిక బయటకు రాలేదు. ఇలా ఉన్న ఈ కేసులో.. తాజాగా షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. విజయవాడలోని సీబీఐ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
అయేషా మీరా శరీర భాగాలను ఆమె కుటుంబ సభ్యులకు అందించాలని.. వారి కుటుంబ సంప్రదాయం ప్రకారం అత్యక్రియలు చేసుకునేందుకు అధికారులు అనుమతించాలని ఆదే శించింది. ఇదేసమయంలో ఆయా శరీర భాగాలను భద్ర పరిచిన ల్యాబ్కు కూడా సీబీఐ కోర్టుఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 27న ముస్లిం సంప్రదాయ విధానంలో అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.
ఒకసారి అంత్యక్రియలు పూర్తి..
వాస్తవానికి అయేషా మీరా అంత్యక్రియలు గతంలోనే ముగిశాయి. అయితే.. అప్పట్లో ప్రభుత్వమే ఈ క్రతువును నిర్వహించింది. దీనిపైనా ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భౌతిక దేహాన్ని సైతం తమకు అప్పగించలేదని కన్నీరుమున్నీరు అయ్యారు. ఆ క్రతువు అలా జరిగిపోగా.. ఆమె శరీరం నుంచి తీసిన కొన్ని భాగాలను హైదరాబాద్లోని ఓ ల్యాబొరేటరీలో విచారణ నిమిత్తం భద్ర పరిచారు. ఇప్పుడు వాటిని కుటుంబానికి అప్పగించాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.
అప్పటి మంత్రి మనవడిపై..
వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనా కాలంలో 2007, డిసెంబరులో విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఉన్నబీఫార్మసీ కాలేజీలో ఓ రోజు తెల్లవారుజామున అయేషా మీరాపై అత్యాచారం హత్య జరిగాయి. ఇది అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో పెను కలకలానికి దారి తీసింది.
ఈ కేసులో అప్పటి మంత్రి కోనేరు రంగారావు మనవడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేసు విచారణ కూడా దారితప్పిందని అసెంబ్లీలో అప్పటి విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి వస్తే.. విచారణకు ఆదేశిస్తామన్నారు. ఇలా.. ఈ కేసు అనేక మలుపులు తిరిగినా.. ఇప్పటికీ తమ కుటుంబానికి న్యాయం జరగలేదని అయేషా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates