అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్ధులు సేఫేనా?

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నీలగిరి బ్లాక్‌లోని నాలుగో అంతస్తులో పనిచేస్తున్న ఓ కోచింగ్ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న పలువురు విద్యార్థులు లోపలే చిక్కుకుపోయారు.

మంటల కారణంగా భవనమంతా దట్టమైన పొగ అలుముకోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. భవనం సమీపంలోనే ఉన్న హైదరాబాద్ మెట్రో మార్గం వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడంతో ట్రాఫిక్‌కు కూడా అంతరాయం ఏర్పడింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. నిచ్చెనల సహాయంతో నాలుగో అంతస్తు బాల్కనీలో నిలబడి సహాయం కోరుతున్న విద్యార్థులను ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

ముఖాలకు ముసుగులు ధరించి, దట్టమైన పొగ మధ్య సిబ్బంది ధైర్యంగా లోపలికి ప్రవేశించి రక్షణ చర్యలు చేపట్టారు. అప్రమత్తంగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి మంటలు మరింత వ్యాపించకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్‌లోని విద్యుత్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు.